Bengaluru Crime: ఆ జంటకు వివాహం జరిగి రెండు నెలలు అయ్యింది. హనీమూన్లో చిన్నపాటి మనస్పర్థలు రావడంతో మధ్యలో ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తొలుత వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వరుడు సూసైడ్ చేసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరు సిటీలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
బెంగుళూరులో దంపతుల కేసులో కొత్త విషయాలు
బెంగళూరు సిటీలోని విద్యారణ్యపురకు చెందిన బిజినెస్మెన్ సూరజ్ శివన్న- గానవిలకు రెండు నెలల కిందట మ్యారేజ్ అయ్యింది. అక్టోబర్ 29న ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా సాగింది. ఆ తర్వాత హనీమూన్ కోసం శ్రీలంకకు ప్లాన్ చేశారు. కోటి ఆశలతో ఆ జంట అక్కడికి వెళ్లింది. తమ లైఫ్లోని కొన్ని విషయాలు బయట పెట్టుకున్నారు. ఈ క్రమంలో గానవి కూడా తన స్నేహితుడి గురించి చెప్పడంతో ఆ దంపతుల మధ్య కొత్త వివాదం మొదలైంది. హనీమూన్లో లేనిపోని సమస్యలు తలెత్తడంతో కేవలం ఐదు రోజులకే అక్కడి నుంచి రిటర్న్ అయ్యింది ఈ జంట.
పోయినవారం ఈ జంట బెంగళూరుకి తిరిగి వచ్చింది. ఈ జంట మధ్య వివాదాలు తెలియడంతో ఇరుకుటుంబాల పెద్దలు సరిదిద్దే ప్రయత్నం చేశారు. త్వరలో ఈ సమస్యకు పరిష్కారమవుతుందని ఆ దంపతులకు హామీ ఇచ్చాడు సూరజ్ అన్నయ్య. అయినా ఆ దంపతులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు గానవి పుట్టింటికి వెళ్లిపోయింది. డిసెంబరు 23న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
పెళ్లైన రెండు నెలలకే నిండు నూరేళ్లు
కుటుంబసభ్యులు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రెండురోజులు వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ గురువారం గానవి మృతి చెందింది. దీనిపై గానవి కుటుంబ సభ్యులు.. సూరజ్ ఫ్యామిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడంతో సూరజ్, అతడి తల్లి ఈ విషయంలో భయపడ్డారు. తల్లితో కలిసి బెంగళూరు నుంచి నాగ్పూర్కి వెళ్లిపోయాడు.
శుక్రవారం రాత్రి ఓ హోటల్లో దిగిన తర్వాత శనివారం తెల్లవారుజామున సూరజ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివన్న తల్లి గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. అప్పటికే సూరజ్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఘటనపై నాగ్పూర్ పోలీసులు సూరజ్ సోదరుడికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం తర్వాత అంత్యక్రియలు చేశారు.
ALSO READ: హైదరాబాద్లో దారుణం.. బంగారం కోసం ఇంటి ఓనర్ని చంపి
సూరజ్ తల్లి కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. గానవి కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. వరకట్న డిమాండ్లు, రిసెప్షన్ ఖర్చుల వ్యవహారంలో హనీమూన్లో భర్త వేధించినట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే గానవి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. కానీ సూరజ్ కుటుంబ సభ్యుల వెర్షన్ మరోలా ఉంది.
వరకట్న విషయంలో ఎలాంటి డిమాండ్లు లేవని, పెళ్లి ఖర్చులు వారే భరించారని అంటున్నారు. హనీమూన్లో గానవి పాత స్నేహం విషయం తేవడమే గొడవకు అసలు కారణమని అంటున్నారు. గానవి మరణం తర్వాత వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఆమె భర్త సూరజ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పాయని అంటున్నారు. ఇరు కుటుంబసభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.