Haryana Vande Bharat Train Accident: భారతీయ రైల్వేలో సరికొత్త శకానికి నాంది పలికాయి వందేభారత్ రైళ్లు. పూర్తి స్థాయి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఈ రైళ్లు, ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 8 కోచ్ లతో ప్రారంభమైన ఈ రైళ్లు ఇప్పుడు, 20 కోచ్ లకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే 24 కోచ్ లకు చేరుకోబోతున్నాయి. అంతేకాదు, వందేభారత్ స్లీపర్, వందేభారత్ మెట్రో, వందేభారత్ పార్శిల్ రైళ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇండియన్ రైల్వేలో ఐకానిక్ రైలుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ తాజాగా ఓ విద్యార్థి మృతికి కారణం అయ్యింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.
వందేభారత్ రైలు ఢీకొని విద్యార్థి మృతి
పానిపట్ కు చెందిన రోహిత్ తాజాగా ట్రాక్ దాటుతుండగా వందేభారత్ రైలు ఢీకొని చనిపోయాడు. 20 ఏండ్ల వయసున్న రోహిత్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రపూట బిషన్ స్వరూప్ కాలనీలోని కోచింగ్ క్లాస్ కు వెళ్లాడు. క్లాస్ అయిపోయిన తర్వాత హరిసింగ్ కాలనీలోని తన నివాసానికి వస్తున్నాడు. మార్గం మధ్యలో ఓ రైల్వే ట్రాక్ ఉంది. దాన్ని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి రోహిత్ రైల్వే ట్రాక్ దాటాడు. కానీ, వందేభారత్ రైలు పవర్ అతడిని వెనక్కి లాగినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్లిన రోహిత్ వెనక్కి వచ్చి రైలుకింద పడి చనిపోయాడు. ఈ రైలు పానిపట్ నుంచి కర్నాల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్ దాటి వెళ్లిన యువకుడు వెనక్కి అంతలా ఎందుకు వచ్చాడు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు రైలు వేగం కారణంగా దాని పరిసరాల్లోని ఆబ్జెక్టులను లాగేసే స్వభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. ఆ కారణంగానే ట్రాక్ దాటి ముందుకు వెళ్లిన రోహిత్ వెనక్కి లాగబడ్డాడని చెప్తున్నారు.
Read Also : వార్ని.. 4 గంటల్లోనే బెంగళూరుకు? ఈ వందేభారత్ ట్రైన్ చాలా స్పీడు గురూ!
పేద కుటుంబానికి చెందిన రోహిత్
బీహార్ లోని గయాకు చెందిన రోహిత్.. తన కుటుంబంతో కలిసి పానిపట్ లో రెంట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. అక్కడే రోహిత్ చదువుకుంటున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ప్రమాదం అనంతరం పోలీసులు స్పాట్ కు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. శవపరీక్ష అనంతరం అతడి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోహిత్ తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అతడికి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే అధికారులతో పాటు రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు రోహిత్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. మరోవైపు కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాగా చదువకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే ఇలా జరిగిందని రోదిస్తున్నారు.
Read Also : ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈ రూట్లో వందే భారత్ సహా 17 రైళ్లు రద్దు