Kalvakuntla Kavitha: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ప్రసంగం విద్యావ్యవస్థలోని లోపాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఒక తల్లిగా, సామాజిక బాధ్యత ఉన్న నాయకురాలిగా ఆమె వ్యక్తం చేసింది.
విద్యాశాఖ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రే ఆ శాఖను పర్యవేక్షించడం మన దౌర్భాగ్యమని కవిత విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రైవేట్ స్కూళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. 50 శాతం నుండి 120 శాతం వరకు ఫీజులు పెంచినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వివాదం
ప్రభుత్వ భూముల్లో నడుస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) లోనే ఫీజులు 120 శాతం పెరగడం దారుణమని ఆమె అన్నారు. అక్కడ 30 ఎకరాల భూమిని కబ్జా చేసే కుట్ర జరుగుతోందని, కమిటీలో ప్రభుత్వ పెద్దల బంధువులు ఉండటం వల్లనే ఈ దోపిడీ సాగుతోందని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ఇచ్చిన విరాళాలకు లెక్కల్లేవని, దీనిపై తక్షణమే రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజుల నియంత్రణ – తక్షణ అవసరం
తమిళనాడు తరహాలో శాశ్వత ఫీజు నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేయాలని లేదా గుజరాత్ మోడల్లో ఫీజులకు పరిమితి విధించాలని కవిత సూచించారు. ‘తల్లిదండ్రుల బలహీనతను వ్యాపారంగా మార్చుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఫీజుల నియంత్రణ జీవో రాకపోతే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయి’ అని హెచ్చరించారు. గత ప్రభుత్వం వేసిన తిరుపతి రావు కమిషన్ నివేదికను అమలు చేయకపోవడం కూడా పొరపాటేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఉచిత విద్య, వైద్యమే మా నినాదం
తెలంగాణ రక్షణ సేన విధానం కేవలం ఉచిత విద్య, వైద్యం చుట్టూనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11 వేల కోట్లు పెండింగ్లో పెట్టి విద్యాసంస్థలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఆడపిల్లను, ఇచ్చిన మాట తప్పను. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వకపోతే నన్ను అమరుల స్థూపానికి కట్టేసి కొట్టండి’ అంటూ భావోద్వేగంగా సవాల్ విసిరారు. ఫీజుల దోపిడీపై అన్ని పార్టీలు ఏకమై జిల్లాల వారీగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
Also Read: మనుషులా.. గాడిదలా? అధికారులపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఫైర్!