ముంబైలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ అర్బన్ కంపెనీ కి చెందిన ఓ మసాజ్ థెరపిస్ట్, ఒక మహిళా కస్టమర్ మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. బుకింగ్ రద్దు విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
ముంబైలోని వడాలా ఈస్ట్, భక్తి పార్క్ ప్రాంతంలో నివసించే 46 ఏళ్ల పిఆర్ ప్రొఫెషనల్ షెహనాజ్ వాహిద్ సయ్యద్ తన భుజం నొప్పి ఉపశమనం కోసం అర్బన్ కంపెనీ ద్వారా మసాజ్ సెషన్ను బుక్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి థెరపిస్ట్ అశ్విని శివనాథ్ వార్తాపి ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే.. థెరపిస్ట్ వెంట తెచ్చిన పోర్టబుల్ మసాజ్ బెడ్ నాసిరకంగా ఉందని.. అది తన ఇంట్లో వాడటానికి అనువుగా లేదని భావించిన షెహనాజ్, ఆ సెషన్ను రద్దు చేశారు.
వైరల్ వీడియోలో దృశ్యాలు..
ఈ రద్దు ప్రక్రియలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో మసాజ్ థెరపిస్ట్ బెడ్ రూమ్లో నిలబడి తన మొబైల్తో కస్టమర్ను రికార్డ్ చేయడం కనిపిస్తుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షెహనాజ్, ‘నా ఇంట్లో ఉండి నాపైనే దురుసుగా ప్రవర్తించవద్దు’ అని గట్టిగా మందిలించారు. థెరపిస్ట్ బ్యాగ్ను బయటకు పంపే క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట మొదలైంది. ఒక దశలో థెరపిస్ట్ కస్టమర్ జుట్టు పట్టుకోగా.. కస్టమర్ ఆమెను మంచంపైకి నెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
కుమారుడి ఆవేదన..
ఈ గొడవ మొత్తాన్ని షెహనాజ్ 18 ఏళ్ల కుమారుడు తన ఫోన్లో చిత్రీకరించాడు. ‘ఈమె పిచ్చిది, మా ఇంట్లోకి వచ్చి మా అమ్మను కొడుతోంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇక నీ కెరీర్ ముగిసిపోయింది’ అంటూ అతను వీడియోలో అనడం వినిపిస్తోంది. తన తల్లిని థెరపిస్ట్ గోళ్లతో గీరిందని.. కంటిపై దాడి చేసిందని అతను ఆరోపించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వడాలా పోలీసులు కేసు నమోదు చేశారు. 32 ఏళ్ల థెరపిస్ట్ అశ్వినిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 115(2) కింద నాన్-కాగ్నిజబుల్ (NC) నేరంగా కేసును నమోదు చేశారు. సర్వీస్ యాప్ల ద్వారా అపరిచిత వ్యక్తులను ఇంటికి పిలిపించుకునే సమయంలో భద్రత మరియు ప్రవర్తనపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.