అదృష్టం.. లక్.. కిస్మత్.. జాక్ పాట్.. జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో టైంలో అదృష్టం తలుపు తడుతోంది.. అయితే అది కొంత మందికి డబ్బుల్లోనూ.. మరి కొంత మందికి ఉద్యోగం లోనూ.. తాము నిర్వహించే బిజినెస్ రంగంలోనూ అదృష్టం వరిస్తోంది. ఇక కొంత మందికి అయితే.. కోట్లల్లో లక్షీ కటాక్షం ఇంటికి వచ్చి చేరుతుంది. తాజాగా.. పంజాబ్కు చెందిన ఒక సామాన్య రైతును అదృష్టం వరించింది. కేవలం రూ. 7లకే కొన్న లాటరీ టికెట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రీ సోధియాన్ గ్రామానికి చెందిన బల్కర్ సింగ్ ఏకంగా 1 కోటి రూపాయల భారీ జాక్పాట్ను గెలుచుకున్నారు. పదేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొంటున్న ఆయనను ఈసారి అదృష్టం కోటీశ్వరుడిని చేసింది.
పదేళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం..
బల్కర్ సింగ్ వృత్తిరీత్యా రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత పదేళ్లుగా ఆయన సిర్హింద్లోని ‘బిట్టు లాటరీ స్టాల్’ నుంచి క్రమం తప్పకుండా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఆయనకు రూ. 90 వేల వరకు చిన్న చిన్న బహుమతులు వచ్చాయి. అయితే, ఈసారి ఏకంగా కోటి రూపాయల బహుమతి వస్తుందని ఆయన ఊహించలేదు. డిసెంబర్ 24న డ్రా తీసిన ఈ లాటరీ ఫలితం, కొన్ని రోజుల తర్వాత కానీ ఆయనకు తెలియలేదు.
గ్రామంలో పండుగ వాతావరణం..
బల్కర్ సింగ్కు కోటి రూపాయలు వచ్చినట్లు తెలియగానే మజ్రీ సోధియాన్ గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. స్థానికులు ఆయనను పూలమాలలతో సత్కరించి, డప్పు చప్పుళ్లతో ఊరేగించారు. బల్కర్ సింగ్ కూడా ఆనందంతో చిందులు వేశారు. గ్రామస్థులందరికీ మిఠాయిలు పంచి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విజయానికి దేవుని ఆశీస్సులే కారణమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
సేవా కార్యక్రమాలకే ప్రాధాన్యత..
ఈ భారీ మొత్తాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించగా.. బల్కర్ సింగ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనకు వచ్చిన ప్రైజ్ మనీలో 10 శాతం మొత్తాన్ని (రూ. 10 లక్షలు) పేదలకు.. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి కేటాయిస్తానని ప్రకటించారు. మిగిలిన మొత్తాన్ని తన వ్యవసాయ పనులను అభివృద్ధి చేసుకోవడానికి, కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తానని తెలిపారు. కష్టపడి పనిచేసే రైతుకు ఇలాంటి అదృష్టం రావడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లాటరీ వ్యాపారి సంతోషం:
సిర్హింద్లో 45 ఏళ్లుగా లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న ముకేశ్ కుమార్ బిట్టు కూడా ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన స్టాల్లో ఇప్పటివరకు రూ. 10 లక్షల వరకు బహుమతులు వచ్చాయని, కానీ కోటి రూపాయల భారీ ప్రైజ్ రావడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. ఫతేగఢ్ సాహిబ్లో జరిగిన షహీదీ సమాగం సేవలో బిజీగా ఉండటం వల్ల ఫలితాన్ని వెంటనే తెలుసుకోలేకపోయామని, ఆ తర్వాతే బల్కర్ సింగ్కు సమాచారం అందించామని ఆయన వివరించారు.
ALSO READ: Naa Anveshana Arrest : 2025లో ఐబొమ్మ రవి… 2026లో నా అన్వేషణ