Viral Video: సాధారణంగా మనకు కుక్క కరిచినప్పుడు తీవ్రమైన భయాందోళనకు గురవుతాము. వెంటనే డాక్టర్ను సంప్రదించి వ్యాక్సిన్ వేయించుకుంటాం. అయితే.. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే.. రెండు ఇంజక్షన్లు తీసుకోగానే ‘నయం అయిపోయింది కదా’ అని భావించి.. డాక్టర్ సూచించిన పూర్తి కోర్సును మధ్యలోనే ఆపేస్తారు. సరిగ్గా ఇలాంటి నిర్లక్ష్యమే ఉత్తరప్రదేశ్లో ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
నాలుగు నెలల క్రితం బాలుడిని కుక్క కరిచింది. రెండు వ్యాక్సిన్లు మాత్రమే తీసుకుని, మిగిలిన కోర్సును మధ్యలోనే వదిలేశాడు. దీంతో లోలోపల వైరస్ తన పని తను చేసుకుంటూనే పోయిందేమో.. ఇప్పుడు ఆ బాలుడు కుక్కలా మొరగడం, వింత వింత చేష్టలు చేస్తూ ఉండటం చూసి స్థానికులతో పాటు వైద్యులు కూడా షాక్కు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో కరణ్ అనే బాలుడిని నాలుగు నెలల క్రితం కుక్క కరిచింది. అయితే, ఆ సమయంలో తండ్రి భైలాల్ బాలుడికి కేవలం రెండు డోసుల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV) మాత్రమే ఇప్పించి కోర్సును మధ్యలోనే నిలిపివేశారు. దీంతో కరణ్ అనారోగ్యానికి గురైయ్యాడు. అతని తండ్రి శాస్త్రీయ చికిత్స కంటే మూఢనమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాలుడిపై దుష్టశక్తుల ప్రభావం ఉందని భావించి, అతడిని భూతవైద్యం కోసం ఒక ఆలయానికి తీసుకెళ్లారు. దీనివల్ల విలువైన సమయం వృధా అయింది. అప్పటికే శరీరంలో ప్రవేశించిన రేబిస్ వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో.. బాలుడు కుక్కలా మొరగడం, వింతగా ప్రవర్తించడం వంటి భయంకరమైన లక్షణాలు బయటపడ్డాయి.
పరిస్థితి విషమించడంతో కరణ్ను వారణాసిలోని ఒక అధునాతన వైద్య కేంద్రానికి తరలించారు. బాలుడి పరిస్థితిని గమనించిన వైద్యులు, రేబిస్ వ్యాక్సిన్ కోర్సును మధ్యలోనే ఆపేయడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించారు. సాధారణంగా రేబిస్ లక్షణాలు బయటపడిన తర్వాత రోగి కోలుకునే అవకాశాలు దాదాపు శూన్యమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Also Read:హైదరాబాద్లో కట్టెలకి డిమాండ్.. ఇండక్షన్ స్టవ్లకి ఆర్డర్స్! యుద్ధం సృష్టిస్తున్న వింత మార్పులివే!
మీర్జాపూర్లో 4 నెలల క్రితం కుక్క కరిచిన బాలుడికి రేబిస్ వ్యాక్సిన్ కేవలం 2 డోసులు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అతడు కుక్కలా ప్రవర్తిస్తున్నాడు. pic.twitter.com/VBWs06PpR7
— Swetcha Daily News (@SwetchaNews) March 15, 2026