Viral Video: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో సోమవారం నాడు ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కదిరేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు ఈ సాహసోపేతమైన చర్యకు పూనుకున్నాడు. చేతిలో తెలుగుదేశం పార్టీ (TDP) జెండా పట్టుకుని సెల్ టవర్ పైకి ఎక్కి తన గోడును వెళ్లబోసుకున్నాడు.
లక్ష్మీనారాయణ కుమార్తెకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. అయితే.. వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ అల్లుడు నిరాకరిస్తున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరైన రీతిలో స్పందించలేదని, తనకు న్యాయం జరగడం లేదన్న మనస్తాపంతోనే తాను టవర్ ఎక్కినట్లు లక్ష్మీనారాయణ తెలిపాడు.
టవర్ పై వ్యక్తిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లక్ష్మీనారాయణను కిందికి దింపేందుకు గంటల తరబడి ప్రయత్నించారు. తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు దిగేది లేదని ఆయన భీష్మించుకు కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు, స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో ఆయన కిందకు దిగివచ్చారు. బాధితుడి సమస్యను పరిశీలించి, చట్టపరంగా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ALSO READ: 125 కేసుల నేరగాడికి చెక్.. హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి కేంద్ర గ్యాలంటరీ మెడల్!
తన కూతురికి విడాకులు ఇచ్చిన అల్లుడు కట్నం కింద తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వడం లేదని సెల్ టవర్ ఎక్కి తండ్రి నిరసన
సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన pic.twitter.com/fkf05GlR5X
— BIG TV Breaking News (@bigtvtelugu) January 26, 2026