Hyderabad Police: హైదరాబాద్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకట్ రెడ్డి సాహసానికి సముచిత గౌరవం దక్కింది. తన ప్రాణాలను పణంగా పెట్టి కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డుతో సత్కరించింది.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 125కు పైగా నేర చరిత్ర కలిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2022లో విశాఖ సెంట్రల్ జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ప్రభాకర్.. పోలీసులకు సవాలుగా మారాడు. అయితే.. నిందితుడు ఒక పబ్ వద్ద ఉన్నాడన్న పక్కా సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, తన సహచర సిబ్బంది ప్రదీప్ రెడ్డి , వీరాస్వామిలతో కలిసి అక్కడికి చేరుకున్నారు.
పోలీసులను చూడగానే నిందితుడు ప్రభాకర్ అప్రమ్తమైయ్యాడు. తప్పించుకోవాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తుపాకీ తీసి పోలీసుల వైపు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక తూటా వెంకట్ రెడ్డి ఎడమ కాలి బొటనవేలికి తగిలి తీవ్ర రక్తస్రావమైంది. సాధారణంగా ఇటువంటి స్థితిలో ఎవరైనా ఆత్మరక్షణ కోసం వెనక్కి తగ్గుతారు. కానీ వెంకట్ రెడ్డి తన గాయాన్ని ఏమాత్రం లెక్కచేయలేదు.
తీవ్రమైన నొప్పిని భరిస్తూనే.. వెంకట్ రెడ్డి ఇతర కానిస్టేబుళ్లతో కలిసి నిందితుడిపైకి దూకి అతడిని చాకచక్యంగా కట్టడి చేశారు. ప్రాణాలకు తెగించి ఆయన ప్రదర్శించిన ఈ సమయస్ఫూర్తి వల్ల ఒక భారీ ప్రమాదం తప్పడమే కాకుండా, కరుడుగట్టిన నేరస్థుడు చట్టానికి చిక్కాడు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా వెంకట్ రెడ్డి చూపిన ఈ సాహసం యావత్ పోలీస్ రంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయనను ఈ అత్యున్నత గ్యాలంటరీ అవార్డుకు ఎంపిక చేసింది.
ALSO READ: పండుగ పూట తీరని లోటు.. బాన్సువాడ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి