Woman Marries Krishna: తాజాగా ఉత్తర ప్రదేశ్లో ఒక విచిత్ర వివాహం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆరాధించిన దైవాన్నే పెళ్లి చేసుకుంది ఓ యువతి. ఈ విషయం వినడానికి విచిత్రంగా అనిపించినా.. ఇదే నిజం. చిన్నప్పటి నుంచి నుంచి కృష్ణుడిపై ప్రేమను పంచుకున్న పింకేష్ శర్మ.. చివరికి ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. అనుకన్నట్టే బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పింకేష్ శర్మకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడు అంటే అమితమైన భక్తి, ప్రేమ. ఎదుగుతున్న కొద్దీ ఆయననే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంటూ వచ్చింది. చివరికి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్లోని బుడాన్ జిల్లాకు చెందిన పింకేష్ శర్మ.. ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఇక పెళ్లిలో వధువు భక్తి పాటలు పాడి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా పెళ్లిలో వరుడు వధువుకు గంధం రాసి కుంకుమ పెడతాడు. కానీ ఈ పెళ్లిలో మాత్రం పింకేష్ శర్మ.. శ్రీకృష్ణుడి పేరున తనకి తానే కుంకుమ పెట్టుకుంది. అంతేకాదు.. వివాహానికి గుర్తుగా పింకేష్ శర్మ కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. వీరి వివాహం తర్వాత బంధువులు అంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు. ఇదంతా ముగిశాక కృష్ణుడి విగ్రహంతోనే వధువు ఇంటి నుంచి బయటికి వచ్చింది.
పింకేష్ శర్మ వివాహం పట్ల ఆమె తండ్రి ఎంతో సంతోషపడ్డారు. తన కూతురు సరైన నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అల్లుడని అన్నారు. బృందావనంలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ఓసారి పింకీ చేతుల్లో గోల్డ్ రింగ్ పడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇది జరిగి మూడు నెలలు అయినట్లు పింకేష్ శర్మ తండ్రి తెలిపారు. అదంతా ఓ మహిమ అని, ఆ తర్వాతే తన కుమార్తె పెళ్లి నిశ్చయం అయినట్లు తెలిపారు. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ పలుచోట్ల జరిగిన సంగతి తెలిసిందే.