కేరళాలో మగాళ్ల ఉద్యమం ఊపందుకుంది. దీనికి కారణం.. ఇటీవల కోజీకోడ్కు చెందిన దీపక్ అనే 41 వ్యక్తి ఆత్మహత్యే. మహిళా ఇన్ఫ్లూయెన్సర్ షిమ్జితా ముస్తఫా.. రీల్స్లో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన వైరల్ వీడియో దీపక్ ప్రాణాలను బలిగొంది. రద్దీగా ఉన్న బస్సులో షిమ్జితా ఉద్దేశపూర్వకంగా దీపక్ వద్దకు వెళ్లి నిలబడి.. సెల్ఫీ వీడియోలు తీసింది. అతడు ఆమెను అసభ్యకరంగా తాకుతున్నట్లుగా చిత్రీకరించింది. ఆ తర్వాత ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. దీపక్ మనస్థాపానికి గురయ్యాడు. అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు షిమ్జితాను అదుపులోకి తీసుకున్నారు.
దీపక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షిమ్జితా పోస్ట్ చేసిన వీడియో చూసి అసభ్యకర కామెంట్లు చేసిన జనాలు.. దీపక్ మరణంతో యూటర్న్ తీసుకున్నారు. తప్పు అతడిది కాదని.. ఆమెదేనంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన ఇప్పుడు కేరళాను కుదిపేస్తోంది. ఎందుకంటే 35 ఏళ్ల షమ్జితా ముస్తఫా సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్, మలప్పురం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్టాండింగ్ కమిటీల్లో పనిచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు గల్ఫ్కు వెళ్లిపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా అవతారం ఎత్తింది. మళ్లీ కేరళాకు వచ్చేసింది. బస్సులో దీపక్ తనని తాకాడని ఆరోపిస్తూ వీడియో తీసి.. పోస్ట్ చేసింది. అది బాగా వైరల్ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. కానీ.. అది దీపక్ జీవితాన్ని నాశనం చేస్తుందని కనీసం ఆలోచించలేదు.
దీపక్ ఓ సంస్థలో సేల్స్ ఆఫిసర్గా పనిచేస్తున్నాడు. ఆఫీసులో, కుటుంబంలో అతడికి మంచి పేరు ఉంది. ఆ రోజు ఎప్పటిలాగానే బస్సులో ప్రయాణిస్తున్నాడు. బస్సు రద్దీగా ఉంది. దీపక్కు సమీపంలో కొంతమంది మహిళలు ఉన్నారు. వారిలో షమ్జితా కూడా ఒకరు. దీపక్ మహిళలను కావాలనే తాకుతున్నాడని ఆమె భావించింది. దీంతో అతడి దగ్గరకు వెళ్లి తనని తాకుతాడో లేదో అని చూసింది. ఆ తర్వాత మరింత దగ్గరకు వెళ్లి నిలబడింది. అతడి చేయి తాకగానే షాకవ్వాల్సిన ఆమె.. మిషన్ సక్సెస్ అన్నట్లుగా నవ్వు ముఖం పెట్టింది. అదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది. బస్సులో పురుషులు తాకితే వెంటనే అక్కడికక్కడే నిలదీయాలి గానీ.. ఇలా నవ్వు ముఖం పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె కావాలనే అతడి చేతికి తగులుకుని.. వీడియోలు తీసుకుందని, రక్షణ కేవలం మహిళలకేనా? మగాళ్లకు లేదా అంటూ మండిపడుతున్నారు. ఇది ఇప్పుడు కేరళలో ఉద్యమంలా మారింది.
Also Read: భూమికి ‘చొట్ట’ – టర్కీలో కుంగిపోతున్న నేల.. పైకి లేస్తున్న పర్వతాలు, జరగబోయేది ఇదేనా?
ఈ ఘటన తర్వాత కేరళలో పరిస్థితులు మారిపోయాయి. రీల్స్, షార్ట్స్.. ఎక్కడ చూసిన దీని గురించే వీడియోలు. బస్సుల్లో అబ్బాయిలు.. అమ్మాయిలు తమని తాకకుండా కార్డుబోర్డులు పెట్టుకున్నట్లు.. ముళ్ల చొక్కాలు, కంచెలు వేసుకుంటున్నట్లుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఒక సీరియస్ విషయం ఫన్నీగానే కాదు.. ఆలోచింపజేసే విధంగా మారిపోయింది. మగాళ్ల రక్షణకు కూడా చట్టాలు ఉండాలనే డిమాండ్తో ఇలా సోషల్ మీడియాలో చిన్న సైజు ఉద్యమమే సాగుతోంది.