Viral Student Answer Sheet: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విద్యార్థి రాసిన తెలుగు పరీక్షా పత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది. పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలో “సొంత వాక్యాలు” రాయమని ఇచ్చిన ప్రశ్నలకు ఆ విద్యార్థి ఇచ్చిన సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి. సాధారణంగా పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఉండే ఒత్తిడి, భయం ఈ సమాధానాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుండగా, అదే సమయంలో విద్యార్థుల ఆలోచనా విధానం, కామెడి టైమింగ్ కూడా బయటపడుతోంది.
ప్రశ్నపత్రంలో “పీడ వదలడం” అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయమని అడిగారు. దానికి ఆ విద్యార్థి ఏమాత్రం తడబడకుండా, మనసులో ఉన్న మాటను బయటపెడుతూ… “పరీక్షలు అయిపోయాయి, పీడ వదిలింది.” అని రాశాడు. కేవలం ఈ ఒక్కటే కాకుండా, “ధ్యాస” అనే పదానికి “చదువు మీద ధ్యాస పెట్టాలి,” అని రాశాడు.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ పిల్లాడు రాసింది అక్షరాలా నిజం.. పరీక్షలు అయిపోతే ఆ ఫీలింగే వేరు.” అని కొందరు అంటుంటే, “టీచర్ కూడా మార్కులు వేయకుండా ఉండలేకపోయారు.” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ విద్యార్థికి ఆ రెండు ప్రశ్నలకు కలిపి పూర్తి మార్కులు పడటం విశేషం. మొత్తం 20 మార్కులకు గానూ ఆ విద్యార్థికి 12 మార్కులు వచ్చాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు పడే ఇబ్బందులను, వారి ఆలోచనా ధోరణిని ఈ వైరల్ పిక్ ప్రతిబింబిస్తోంది. ఏది ఏమైనా, పరిక్షలంటే భయం ఎవరికుండదు. ఈ రోజుల్లో విద్యార్థులకు భయంతోపాటు క్రియేటివిటీ కూడా ఎక్కువని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి. అయితే ఈ ఘటన 2023లో జరిగినప్పటికీ పరిక్షల సీజన్ కావడంతో ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: రైల్వే మన అందరిదీ అంటే ఇలా అర్థమైందా? బ్లాంకెట్లు కాజేసీ.. అమాయకంగా..