AP Politics(Telugu news live today): వైనాట్ 175. జగన్ టార్గెట్ ఇది. ఏడాదిగా ఊదరగొడుతున్నారు. వైనాట్ 175పై టీడీపీ నేతలు అనేకసార్లు పంచ్లు వేశారు. తీరా ఎన్నికల వేడి పెరిగేసరికి చంద్రబాబు సైతం టార్గెట్ 175 నినాదం ఎత్తుకున్నారు. మరే డైలాగ్ లేదన్నట్టు.. జగన్ నినాదాన్నే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కాపీ కొట్టడం ఆసక్తికరంగా మారింది.
జగన్ డైనమిక్ లీడర్. కేసులు పెట్టి జైల్లో పెట్టినా.. ఓదార్పు యాత్రలతో ఓపిగ్గా ఎదురుచూశారు. తొలిసారి పరాజయం ఎదురైనా.. రెండోసారి అత్యంత భారీ మెజార్టీతో తిరుగులేని నేతగా ఎదిగారు. ఇక, సీఎం కుర్చి దిగేదేలే అనేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే ఐప్యాక్ను రంగంలోకి దింపారు. విస్తృత సర్వేలు, గడగడపకు మన ప్రభుత్వం, ఇంటింటికీ జగనన్నలాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను రేసుగుర్రాలుగా ప్రజల ముందుంచుతున్నారు. వైనాట్ 175 అంటూ.. ఈసారి టోటల్ క్లీన్ స్వీప్పై కన్నేశారు వైఎస్ జగన్.
వైనాట్ 175.. విపక్షానికి మైండ్ బ్లాంక్ చేసిన స్లోగన్. కుప్పంతో సహా అన్నిస్థానాల్లో గెలవాలని, గెలుస్తామని.. ప్రజలను మెంటల్గా ప్రిపేర్ చేసే సత్తా ఉన్న నినాదం. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇదేమంత కష్టమైన టార్గెట్ కాదని సీఎం జగన్ చాలా ధీమాగా చెబుతున్నారు. టీడీపీ మాత్రం అంత సీన్ లేదంటూ.. రోటీన్ విమర్శలు చేస్తూ వచ్చింది.
కుప్పంపై కన్ను.. చంద్రబాబే టార్గెట్..
సైకిల్ పార్టీని మరింత డిఫెన్స్లో పడేసేలా ఏకంగా కుప్పంనే టార్గెట్ చేశారు జగన్. స్థానిక నేత భరత్ను ఎమ్మెల్సీని చేశారు. మూడేళ్ల ముందే అతన్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. గెలిపిస్తే మంత్రిని కూడా చేస్తానని ఆశపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డికి కుప్పం గెలుపు బాధ్యతలు అప్పగించారు. స్థానిక టీడీపీ నేతలను కేసులతో కట్టడి చేస్తూ.. చాలా పకడ్బందీగా రాజకీయం చేస్తున్నారు జగన్. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబునే కుప్పంలో సభలు, ర్యాలీలు చేయకుండా.. జీవో నెంబర్ 1తో ఖాకీబంధనం చేసి చెక్ పెట్టారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో టీడీపీని ఉలిక్కిపడేలా చేశారు. అందుకే, చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనివిధంగా పదే పదే సొంత నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ఈసారి లక్ష మెజార్టీయే లక్ష్యమంటూ.. గెలుపు కోసం గట్టి పోరాటమే చేస్తున్నారు.
పులివెందులపై టీడీపీ ఫోకస్ ఎంత?
ఇలాగైతే లాభం లేదని.. డిఫెన్స్ గేమ్తో పని కాదని.. లేట్గా అయినా లేటెస్ట్గా గుర్తించినట్టున్నారు చంద్రబాబు. ఎన్నికల రేసులో వెనకపడిపోకుండా.. టార్గెట్ 175 అంటూ.. జగన్కు పోటీగా జగన్ నినాదాన్నే అందుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు.. జగన్ను ఇంతలా ఫాలో అవుతున్నారంటూ వెటకారం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో సైతం.. పులిహోర మేనిఫెస్టో అంటూ జగన్ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ పథకాలను, కర్నాటక కాంగ్రెస్ హామీలను కలిపేశారని.. కాపీ క్యాట్ అంటూ కౌంటర్లు విసురుతున్నారు. అయితే, కుప్పంలో తనను వైసీపీ టార్గెట్ చేసినట్టు.. చంద్రబాబు మాత్రం పులివెందులలో జగన్కు సవాల్ విసరలేకపోతున్నారు. ఏదో అప్పుడప్పుడూ పులివెందులపై పంచ్ డైలాగులు వదలడం వరకే పరిమితం అవుతున్నారు. బిటెక్ రవిలాంటి బలమైన లీడర్లు ఉన్నా.. పులివెందులలో వైఎస్ కుటుంబం ఆధిపత్యాన్ని అడ్డుకోలేకపోతున్నారని అంటున్నాయి. మరి, పులివెందులలో వేలు కూడా పెట్టలేకపోతున్న టీడీపీ.. 175కి 175 ఎలా గెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ లెక్క ఇదే..
అయితే, తమను అంత తక్కువగా అంచనా వేయొద్దంటోంది టీడీపీ. ఇటీవల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలు కొల్లగొట్టిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అందులో, సీమ స్థానం కూడా ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమాగా చెబుతున్నారు.
టార్గెట్ 175తో చంద్రబాబు మైండ్ గేమ్!
మరోవైపు, చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ 175 సైతం రాజకీయ డైలమా క్రియేట్ చేస్తోందంటున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం టీడీపీనే గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే.. మరి జనసేన, బీజేపీల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. ఇటీవలే ఢిల్లీలో అమిత్షా, నడ్డాలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని తేల్చి చెబుతున్నారు. పొత్తులపై డైరెక్ట్గానే లీకులు ఇస్తున్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ వైసీపీ ఎంతగా కవ్విస్తున్నా.. మా సంగతి మీకెందుకంటూ ఏమాత్రం టెంప్ట్ అవ్వట్లేదు జనసేనాని.
ఇలాంటి సమయంలో టీడీపీ మాత్రం టార్గెట్ 175 నినాదం ఎత్తుకోవడం ఏంటి? అంటే పొత్తు ఉండదనా? మిత్రపక్షాలతో కలిసి మొత్తం స్వీప్ చేస్తామనా? లేదంటే, చంద్రబాబు కావాలనే వ్యూహాత్మకంగా 175 అంటున్నారా? ఏపీలో టీడీపీనే లీడ్లో ఉందనేలా సీన్ క్రియేట్ చేసి.. పొత్తుల్లో మెజార్టీ స్థానాలు డిమాండ్ చేయాలని ఎత్తుగడ వేశారా? పవన్ సైతం తానే సీఎం అంటూ.. ఊరూరా తిరిగి చెబుతుండటంతో.. జనసేనానిపై మైండ్ గేమ్లో భాగంగానే.. చంద్రబాబు టార్గెట్ 175 స్లోగన్ అందుకున్నారా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి 175 వర్సెస్ 175 పాలిటిక్స్ ఏపీలో కాక రేపుతున్నాయి.