Kakinada: కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి శివరామకృష్ణ (శివరాం కుమార్) నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కోట్ల విలువైన అక్రమ ఆస్తులను బట్టబయలు చేసింది.
ఏకకాలంలో నలువైపులా సోదాలు
ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో జూన్ 5న ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. కాకినాడలోని శివరామకృష్ణ నివాసం, ఆయన కార్యాలయంతో పాటు సోదరి, మామగారి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈయన ఇళ్లలో దొరికిన సంపద చూసి అధికారులే విస్తుపోయారు.
విలాసవంతమైన ఫ్లాట్లు, భూములు
సోదాల్లో భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్ వెనుక ఒక 3BHK ఫ్లాట్, ఆయన భార్య పేరిట మరో 4BHK లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు తేలింది. వీటితో పాటు తెలంగాణలోని ఐటీ హబ్ కొండాపూర్లో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్, రామారావుపేటలో ఖరీదైన స్థలం, పలుచోట్ల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కోట్లలో లగ్జరీ కార్లు, బంగారం
నిందితుడి ఇంట్లో లగ్జరీ వాహనాల జాతరే కనిపించింది. ఒక టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఎలక్ట్రిక్ BE6 కారుతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మహీంద్రా థార్ రాక్స్ వాహనాన్ని ఏసీబీ సీజ్ చేసింది. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా. ఇవే కాకుండా 700 గ్రాముల బంగారు ఆభరణాలు, భారీగా నగదు, ఖరీదైన ల్యాప్టాప్లు, ప్రీమియం మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల పూర్తి విలువను లెక్కించే పనిలో ఉన్న అధికారులు, సోదాలు ముగిశాక పూర్తి నివేదికను విడుదల చేయనున్నారు.
Also Read: భీంగల్లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!
కాకినాడలో ఏసీబీ దాడులు.. కోట్ల అక్రమాస్తులతో రెవెన్యూ అధికారి శివరాం కుమార్
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న శివరాం కుమార్
ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ, తెలంగాణలోని 4 చోట్ల ఏకకాలంలో సోదాలు
రామారావుపేటలో స్థలం, 3BHK, 4BHK… pic.twitter.com/HKH5PKYwMJ
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2026