Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బయటకు ప్రస్తావించలేని పదాలను ఉపయోగించి.. దూషించారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గుంటూరులో అంబటి పర్యటనను తెలుగు దేశం శ్రేణులు అడ్డుకోవడంతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. వైసీపీ తలపెట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరంట్లకు వెళ్తున్న తన వాహనాన్ని అడ్డగించడంతో బూతుల పురాణాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అంబటి వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో.. టీడీపీ శ్రేణులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి గుంటూరులోని చిల్లీస్ సెంటర్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్లెక్సీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని.. దానిని వెంటనే తొలగించాలని శుక్రవారం అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లేదంటే తానే స్వయంగా వచ్చి తొలగిస్తానని సవాలు విసిరారు. ఈ క్రమంలోనే శనివారం కారులో గోరంట్లకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి ఫ్లెక్సీ వద్దకు రావాలని అంబటి భావించారు. ఈ క్రమంలో గోరంట్లకు బయలుదేరిన అంబటి కారును పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కర్రలు, రాడ్లతో ఆయనపై దాడికి యత్నించారన్న ఆరోపణలను వైసీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన అంబటి.. చంద్రబాబును ఘాటు పదజాలంతో దూషించారు.
సీఎం చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడ్డ అంబటి రాంబాబు
తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు గోరంట్లకు వెళ్తున్న అంబటిని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
ఈ క్రమంలో సహనం కోల్పోయి సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు
Ambati… pic.twitter.com/j5Y2wIKFep
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
ఘటనపై అంబటి రాంబాబు స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారన్న అంబటి.. పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారని ఆక్షేపించారు. టీడీపీ కార్యకర్తలు.. కర్రలు, రాడ్లను పట్టుకొని నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండిపోయారని అంబటి ఆరోపించారు. కాగా ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనూ ఓ గుడిలో రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం తీవ్ర గందరగోళానికి కారణమైంది.
సీఎం చంద్రబాబును అనరాని మాటలు అన్న అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంను దూషించిన అంబటిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాహసం మరే వైసీపీ నేత చేయకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలుగు దేశం కార్యకర్తలు కోరుతున్నారు.