మున్సిపల్ ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బిజీలో నిమగ్నం అయ్యాయి. అధికార పార్టీతో మిగతా పార్టీలు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంలోకి దిగేందుకువ్యూహాలు రచిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినా ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై మాత్రం ఇంకా ఫోకస్ చేయడం లేదని తెలుస్తున్నది. ఎందుకంటే ఆ పార్టీని ప్రస్తుతం కేసులు వెంటాడుతున్నాయి. మొన్నటివరకు కేవలం కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ కేసు వెంటాడగా.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ పార్టీ కీలక నేతల మెడకు చుట్టుకున్నది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించగా.. తాజాగా గులాబీబాస్, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి పదేండ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించింది. సీఎంగా కేసీఆర్ తన మార్కు పాలన చూపించగా.. రెండో టర్ములో ఆయన పాలనపై అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున వచ్చాయి. దీనికి తోడు గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేతల రేవంత్ రెడ్డి, నాటి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వగా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పంజాగుట్ట పీఎస్లో తన ఫోన్ ట్యాప్ అయ్యిందని నమోదైన ఓ కేసు విషయంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.ఈ కేసులోనే సాక్షులుగా హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, బండి సంజయ్, మిగతా నేతలను అధికారులు విచారించి వాంగ్మూలం రికార్డు చేశారు. తాజాగా కేసీఆర్ను సాక్షిగా విచారించేందుకు సిట్ నోటీసులు ఇచ్చింది.
అయితే, ఈ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారు? అని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో డీపీఆర్ మార్పు, బ్యారేజీల నిర్మాణంలో తుది నిర్ణయం కేసీఆర్దే అని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే,కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కంపెనీలకు కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టే విషయంలో నిర్ణయం అంతా హరీశ్ రావుదే అని ప్రచారం జరిగింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సైతం కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు కేసీఆర్ది అని తేల్చిందని.. అందుకు హరీశ్ రావే కారణమని ఆరోపించారు. అవినీతి మరకను ఉద్యమనేతకు అంటించారని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ ఆయన హస్తం ఉందని ఆరోపించారు.తనది, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నీ కేసీఆర్కు తెలియకపోవచ్చని.. ఆయన వరకు వెళ్లకుండా వీరే మేనేజ్ చేశారని.. అందుకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని.. అధికారానికి పార్టీ దూరమైందన్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ చేశారని.. పార్టీని హస్తగతం చేసుకోవడానికి సైతం ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని కేసులు వెంటాడటానికి, ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఆయనే కారణమనే విమర్శలు సైతం ఉన్నాయి.