AP Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మంత్రి మండలి నిర్ణయంతో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28కి చేరింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా ప్రకటించారు. మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసింది. ప్రజల నుంచి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాంతీయ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ఈ మూడు జిల్లాలు ఏర్పాటు చేసినట్లు కేబినెట్ పేర్కొంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ సీఎం చంద్రబాబు నివేదిక అందించింది. సబ్ కమిటీ నివేదికను కేబినెట్ లో చర్చించి కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరికైన మార్కాపురం జిల్లాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందులు పడేవారు. దీంతో కూటమి ప్రభుత్వం మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు కలిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసింది. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి.
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్పై కేబినెట్ లో తీవ్రమైన చర్చ జరిగింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్వేగానికి లోనైనప్పటికీ, భౌగోళిక, సాంకేతిక కారణాలతో మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఖరారు చేశారు. మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లు కలిపి అన్నమయ్య జిల్లాలో ఉంటాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉండగా, జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తు్న్నారు. జిల్లా పేరులో మార్పు చేయలేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారించేందుకు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షణ, ఏజెన్సీలో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలకు శాశ్వత కలెక్టరేట్లకు నిధులు కేటాయించనున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు లేకుండా పోలవరం జిల్లా ఏర్పాటుపై కేబినెట్ లో ప్రశ్నలు తలెత్తాయి. దీంతో పోలవరం నిర్వాసితుల కోసమే ఈ జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
బనగానపల్లె, అడ్డరోడ్డును రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్పు చేశారు. దర్శి నియోజకవర్గాన్ని అద్దంకి సబ్ డివిజన్ లోనే భాగం చేశారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు కేటాయించారు. సిద్ధవటం, ఒంటిమిట్టను కడపలోకి మార్పు చేశారు. మడకశిరను ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు.
Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్