CM Chandrababu: దేశంలో హ్యూమన్ హెయిర్ పరిశ్రమకు గ్రోత్ ఉందా? రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయా? వెంట్రుక ఎగుమతులపై నిషేధం విధించాలని సీఎం చంద్రబాబును ఎందుకు ఏపీ ఛాంబర్స్ కోరింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
దేశంలో మానవ వెంట్రుకల పరిశ్రమ గ్లోబల్ బ్రాండ్ స్థాయికి చేరింది. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బిలియన్ డాలర్ పరిశ్రమగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయుల కేశాలు ప్రపంచంలో అత్యంత నేచురల్, అనుకూలమైనదిగా గుర్తింపు పొందింది. అందుకే దీనికి వివిధ దేశాల్లో మాంచి డిమాండ్ ఉంది.
ఇండియా నుంచి చైనా, యుఎస్ఏ, యూరప్, బ్రెజిల్, నైజీరియా, వెనిజులా, దక్షిణాఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతాయి. దేశంలో ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.8000 కోట్ల వరకు ఉంది. రాబోయే దశాబ్దం నాటికి ఈ మార్కెట్ విలువ 30 వేల కోట్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలో మానవ వెంట్రుకలపై వ్యాపారం తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో జరుగుతుంటాయి. తిరుమల శ్రీవారికి ప్రతీ ఏడాది కోట్లలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. దేశంలో అతిపెద్ద ‘రా హేర్’ సోర్స్. హెయిర్ ఎక్స్టెన్షన్స్, విగ్గులు, హెయిర్ పీస్లు, కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.
ALSO READ: కోటా ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం.. తెర వెనుక వారి పనేనా?
అంతేకాదు మెడికల్ విభాగంలో క్యాన్సర్ రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వింగ్ల కోసం ఉపయోగిస్తారు. కొన్నిసార్లు తక్కువ నాణ్యత గల వెంట్రుకలను ఎరువుల పరిశ్రమల్లో వాడతారు. లక్షలాది మంది మహిళలు ఈ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు, సేకరణ కేంద్రాలు, ఎగుమతి సంస్థలు ద్వారా ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.
రెండురోజుల కిందట అమరావతిలో సీఎం చంద్రబాబును ఏపీ ఛాంబర్స్ ప్రతినిధుల బృందం కలిసింది. చైనాకు వెంట్రుకల ఎగుమతులపై నిషేధం విధించాలని కోరింది. దీనికి సంబంధించి వినతి పత్రాన్ని సమర్పించింది. దేశంలో హెయిర్ ఇండస్ట్రీని కాపాడాలని కోరింది.
ఆలయాల నుంచి సేకరించే తల నీలాల వేలంలో నమోదు చేసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంచాలని అందులోకి కీలకమైన పాయింట్. ప్రాసెస్ చేసిన జుట్టును నాన్-రెమీ హెయిర్గా పిలుస్తారు. దేశలో దీని మార్కెట్ విలువ 8 వేల కోట్ల వరకు ఉందని, వచ్చే దశాబ్దం నాటికి ఈ 30 వేల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా సహా ఇతర దేశాలకు ముడి వెంట్రుకలు, నాన్-రెమీ హెయిర్ ఎగుమతులను నిలుపుదల చేయించాలని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు కోరారు. ఏపీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, మాడేపల్లి, విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో వ్యాపారం జరుగుతుంది.
శిరోజాలకు మార్కెట్ డిమాండ్ దృష్ట్యా భారత నుంచి చైనీయులు భారీగా దిగుమతి చేసుకునేవారు. దశాబ్దం కిందట భారీగా వెంట్రుకలను దిగుమతి చేసుకుందని, కొన్నాళ్లుగా చైనా వైఖరిలో మార్పు వచ్చిందని చెబుతోంది ఏపీ ఛాంబర్స్. లీగల్గా కాకుండా ఇల్లీగల్గా నాన్-రెమీ హెయిర్ స్మగ్లింగ్ చేస్తోందని అంటోంది.
మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల ద్వారా కురులను అక్రమ రవాణా చేస్తోందని, బాల కార్మికులతో ప్రాసెస్ చేయించి పన్నుల నుంచి తప్పించుకుంటోందని చెబుతోది. మూడేళ్ల కిందట డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీనిపై నిషేధం విధించిందని, అయినప్పటికీ ఎగుమతులు కొనసాగుతున్నాయని అంటోంది ఏపీ ఛాంబర్స్. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.