CID : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగర టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావును సీఐడీ అరెస్టు చేసింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోలీసులు వారి ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు. 17 గంటల విచారణ తర్వాత రాత్రి 10 గంటలకు తండ్రీకొడుకులను అరెస్టు చేశారు. జగజ్జననీ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో చట్ట వ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఆ సంస్థ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ను అరెస్టు చేసినట్లు సీఐడీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
అరెస్ట్ తర్వాత ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ను రాజమండ్రి జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇద్దరికీ మే 12 వరకు రిమాండ్ విధిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాత్రి ఒంటి గంట సమయంలో ఉత్తర్వులు ఇచ్చారు.
జగజ్జననీ చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాకినాడకు చెందిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కొర్ని వరప్రసాద్ ఏప్రిల్ 29న సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు 420, 409, 120(బి), 477(ఎ), రెడ్విత్ సెక్షన్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంస్థ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి వెంకట జోత్స్నతోపాటు జగజ్జననీ సంస్థను నిందితులుగా పేర్కొన్నారు. జోత్స్న అప్పారావు కుమార్తె. విచారణ సమయంలో టీడీపీ కార్యకర్తలు స్థానిక సీఐడీ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో రోజంతా రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండించారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని మండిపడ్డారు.