Margadarsi chit fund case latest news(Andhra news today): ఒకటి రెండు కాదు.. ఏకంగా 793 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా రామోజీరావును వెంటాడుతున్న సర్కారు.. తాజా నిర్ణయంతో బిగ్ షాకే ఇచ్చినట్టైంది.
మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్టు ఏపీ సీఐడీ గుర్తించింది. మార్గదర్శిలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడినట్టు సీఐడీ చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శికి 37 బ్రాంచ్లు ఉన్నాయి. 1989 చిట్స్ గ్రూప్లు ఉన్నాయి. తెలంగాణలో మరో 2,316 చిట్స్ గ్రూప్లు నడుస్తున్నాయి. అయితే, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ద్వారా.. ఖాతాదారులకు వెంటనే డబ్బుఇచ్చే పరిస్థితిలో మార్గదర్శి లేదనేది సీఐడీ ఆరోపణ. ఇలా ఖాతాదారుల డబ్బును వివిధ రంగాలకు మళ్లించడం.. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమంటూ కేసు నమోదు చేసి.. వందల కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఏపీ సీఐడి. ఇది, మీడియా మోఘల్ రామోజీరావుకు కోలుకోలేని దెబ్బే అంటున్నారు.
గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావును టార్గెట్ చేశారు. ఆయన ఆర్థిక కుంభస్థలంపై దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వరుసబెట్టి మార్గదర్శి చిట్ఫండ్స్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, అత్యంత బలవంతుడైన రామోజీరావును ఏమీ చేయలేకపోయారు. ఖాతాదారులను భయభ్రాంతులకు గురి చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కట్ చేస్తే…
జగన్ సీఎం అయ్యాక.. రామోజీరావుపై మళ్లీ ఫోకస్ పెట్టారు. ఆయన టీడీపీకి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఉంటారని కక్ష కట్టారని అంటారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసును మళ్లీ బయటకు తీశారు. ఏపీ సీఐడీని రంగంలోకి దించారు. ఇప్పటికే మార్గదర్శి యాజమాన్యాన్ని ప్రశ్నించి.. పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది సీఐడీ. తాజాగా రూ.793 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తున్నట్టు ప్రకటించడం కలకలం రేపుతోంది.