CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్నారు. జ్యూరిచ్ చేరుకున్న ఆయనను ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ ఛైర్మన్ కిషోర్ లుల్లా భేటీ అయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ లతో కలిసి కిషోర్ లుల్లా సీఎంతో భేటీ అయ్యారు. దావోస్ మ్యాన్ అంటూ తన సహచరులకు సీఎం చంద్రబాబును పరిచయం చేశారు ఈరోస్ ఛైర్మన్ కిషోర్ లుల్లా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈరోస్ జెన్ ఏఐ, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితర ఉత్పత్తుల తయారీని ఈరోస్ ప్రతినిధులు వివరించారు. ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు సీఎంకు ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Also Read: ఏపీకి స్విస్ పెట్టుబడుల వెల్లువ.. జ్యూరిచ్లో రాయబారితో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కీలక భేటీ!
స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ 2025 సదస్సు ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు మార్గం సుగుమం చేసిన సీఎం చంద్రబాబును మృదుల్ కుమార్ ప్రశంసించారు. కీలక రంగాలలోకి స్విస్ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లడంపై ఈ భేటీలో చర్చించారు. లీచ్టెన్స్టెయిన్ వంటి దేశాల స్ఫూర్తిదాయకమైన సాంకేతిక పురోగతిని, ముఖ్యంగా AIలో పెట్టుబడులను హైలైట్ చేశారు.