Renuka Chowdhury: కేంద్ర ప్రభుత్వంపై, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నిప్పులు చెరిగారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని, పేదల హక్కులను కాలరాసే హక్కు ప్రధానికి లేదని ఆమె మండిపడ్డారు. రాముని పేరు వాడుకుంటూ ఇలాంటి అరాచకాలకు పాల్పడితే దేవుడు కూడా క్షమించడని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారులపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల పట్ల రేణుక చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మహిళా అధికారులు ఏం వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? మా దుస్తులకు మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా?” అని ఆమె ప్రశ్నించారు. ఐఏఎస్ కావడానికి ఎంత కష్టపడాలో తెలుసా అని నిలదీస్తూ, మహిళా అధికారుల వ్యక్తిగత జీవితాలపై ‘రాసలీలలు’ అంటూ నిరాధారమైన వార్తలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా అధికారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. వెంకటరెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అని, ఆయనపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేస్తూ.. అధికారంలో లేకపోవడంతో ఆయనకు నిద్ర పట్టడం లేదని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుండి తానే పోటీ చేస్తానని ప్రకటించిన రేణుక చౌదరి, “దమ్ముంటే నా గెలుపును ఆపి చూడు” అంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు. ఖమ్మం ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Read Also: వినుకొండ RTC బస్స్టాండ్లో తొక్కిసలాట.. 4గురు స్పాట్లోనే..