AP Social Media Ban: ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని యోచిస్తోంది. ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల బారిన పడకుండా నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు పౌష్టికాహారం, జనాభా నిర్వహణ, శాంతిభద్రతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆస్ట్రేలియా, స్పెయిన్ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పెరుగుతున్న విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేయాలని, చిన్న వయస్సులోనే పిల్లలు తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసభ్యకర పోస్టులు పెట్టినా అస్సలు వదిలిపెట్టవద్దని పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు కూడా వెనకాడబోమని చంద్రబాబు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మార్చి నాటికి రాష్ట్రంలో నూతన ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగంపై దృష్టి సారిస్తూ, పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.శాంతిభద్రతలపై ప్రతి నెలా స్వయంగా సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు.
‘కేర్ అండ్ గ్రో’ యాప్ ద్వారా మాతాశిశు ఆరోగ్యం, పెరుగుదల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో నాణ్యమైన పౌష్టికాహారం మరియు సప్లిమెంట్స్ అందేలా చూడాలని, రాష్ట్రంలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచి, సిజేరియన్లను తగ్గించాలని స్పష్టం చేశారు. జూన్ నాటికి ‘ఫ్యామిలీ కార్డు బెనిఫిట్ సిస్టమ్’ ద్వారా సమగ్ర కార్డుల పంపిణీ పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ను ‘ఎయిడ్స్ రహిత రాష్ట్రం’గా ప్రకటిస్తామని వెల్లడించారు.