ఏపీ, తెలంగాణ మధ్య చాలా పంచాయితీలు ఉన్నాయి. అందులో విభజన హామీలు, నీటి జగడాలు, ఉద్యోగుల పరస్పర బదిలీల విషయంలోనూ చాలానే అంశాలు అపరిశ్కృతంగా ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో చాలా మేర కొలిక్కి వచ్చాయి. కొన్ని మాత్రం ఇప్పటికీ రాలేదు.వీటిని త్వరగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలు పలుమార్లు భేటీ అవుతున్నా.. అభిప్రాయ భేదాలు రావడంతో వాటికి ముగింపు దొరకడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణలోని 7 మండలాలను పోలవరం ముంపు ప్రాంతాలుగా గుర్తించి వాటిని ఏపీలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో అవి అధికారికంగా ఏపీలో కలిసి పోయాయి. కానీ, అక్కడి ప్రజలు మాత్రం అభివృద్ధికి దూరం అవుతున్నారు.
తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాలకు రాజధాని అమరావతి చాలా దూరం. దీనికి తోడు సరిహద్దులో ఉండటం వలన అభివృద్ధికి అవి ఆమడదూరంలో ఉన్నాయి.అయితే,తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం దేవాలయానికి సంబంధించిన భూములు ప్రస్తుతం ఏపీలో కలిశాయి. ఆలయం చుట్టు పక్కల ఐదు గ్రామ పంచాయతీలు ఏపీలో కలవడంతో అక్కడ చెత్త మేనేజ్మెంట్ సైతం స్థానిక అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అక్కడి పరిస్థితిని వివరించారు. ఆ ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కోరారు. అలా చేయడం వలన అక్కడ అభివృద్ధితో పాటు భద్రాద్రి రామయ్య ఆలయ భూముల వివాదం కొలిక్కి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో విలీనమైన గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణకు అందించే విషయంలో సీఎం చంద్రబాబు మానవతాదృక్పథంతో ఆలోచించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ అన్నారు. ఇలా చేయడం వలన రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రజల అభీష్టం మేరకు చంద్రబాబు ఆలోచన చేయాలని సూచించారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొన్నది. ఇదిలాఉండగా, నాడు ఏపీలో 7 మండలాల విలీన సమయంలోనూ వారంతా తెలంగాణలోనే ఉంటామని నిరసనలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కేంద్రం తమ అభిప్రాయం తీసుకోకుండా ఏపీలో విలీనం చేయడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఖమ్మం జిల్లాలో ఉండే 7 మండలాల ప్రజలకు ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్, అటు ఏపీ రాజధాని అమరావతి సైతం దూరమే. వాణిజ్య కోసం ఖమ్మం వాసులు ఎక్కువగా విజయవాడకు ప్రయాణం చేస్తుంటారు.ఇక ఏదైనా అధికారిక పనుల కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చేది. వారి కుటుంబంలోని వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలే ఉన్నాయి. ఇక ఏపీలో కలపడం వలన వారికి సంక్షేమ పథకాలు రావాలంటే వాటన్నింటినీ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.తీరా వారు ఏపీ రాజధాని చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి.ఏపీ అధికారులు మాత్రం
మీ డాక్యుమెంట్స్ తెలంగాణలో ఉంటే సంక్షేమం, ఓటు వేయడానికి వీలు కాదని చెప్పడం.. తెలంగాణ వాళ్లు ఏమో అధికారికంగా మీరంతా ఏపీ వాసులే అని చెప్పడంతో విసుగుచెందడం వారి వంతు అయ్యింది.