KTR: హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కట్టినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇతర నేతలతో కలిసి ఆయన ‘మూసీ దండియాత్ర’ నిర్వహించారు. కేకే నగర్ ఫేజ్-2 నుండి మధుపార్క్ రిడ్జ్ వరకు సాగిన ఈ పాదయాత్రలో బాధితులను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజాపాలన కాదని.. ఇది పక్కాగా ‘బుల్డోజర్ పాలన’ అని ఆయన ఎద్దేవా చేశారు.
మూసీ ప్రక్షాళన పేరుతో వేల కుటుంబాలను రోడ్డున పడేస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. “అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. కానీ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది పేదల ఇళ్లు కూల్చడం కాదు.. ఇందిరమ్మ ఇళ్లు కట్టివ్వడం” అని ఆయన హితవు పలికారు. అనుమతులు ఉన్న ఇళ్లను కనీసం డీపీఆర్ (DPR) కూడా చూపించకుండా ఏ ప్రాతిపదికన కూలగొడతారని అధికారులను నిలదీశారు. ఒక్క పేదవాడి ఇల్లును ముట్టుకున్నా తాము స్వయంగా వచ్చి బుల్డోజర్లకు అడ్డుపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి రెండు మూడు ఇళ్లు ఉండొచ్చు కానీ.. నిరుపేదలకు ఉన్న ఒక్క గూడును పడగొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,866 కోట్లతో ఎస్టీపీలు (STP) నిర్మించడమే కాకుండా.. ఒక్క ఇల్లు కూడా పడగొట్టకుండా ఉప్పల్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేసినట్లు వివరించారు. కేవలం రూ. 16 వేల కోట్లతో పూర్తయ్యే పనికి లక్షన్నర కోట్లు ఎందుకు కేటాయిస్తున్నారని.. ఈ నిధులు కమీషన్ల కోసమేనని ఆరోపించారు. కమీషన్లకు ఎగబడి ప్రభుత్వం తన విలువను పోగొట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని ప్రజలకు అర్థమైంది కాబట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాల వల్ల ‘పైశాచిక ఆనందం’ పొందుతున్నారని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. మూసీ పొడవునా ఉన్న 55 కిలోమీటర్ల మేర లక్షా యాభై వేల కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని.. బాధితుల పక్షాన బీఆర్ఎస్ ఎంతవరకైనా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు. నగరంలో కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదని, ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదని.. కేవలం ఉన్నవాటిని కూల్చడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు.