CM Revanth Reddy: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు పెను సంక్షోభానికి దారితీస్తున్నాయి. అమెరికా.. ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆ దేశం రగిలిపోతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సహా గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం ముదురుతున్నట్లు వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకుని.. అక్కడ నివసిస్తున్న వారు భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు (Embassy) జారీ చేసే సూచనలు.. హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. తెలుగు ప్రజలను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నామని.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారత ఎంబసీలు.. కాన్సులేట్లతో సంప్రదింపులు జరపాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఆందోళన చెందకుండా.. స్థానిక నిబంధనలను గౌరవిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని.. యుద్ధ మేఘాలు తొలగి శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వేలాది మంది తెలంగాణ కార్మికుల కుటుంబాలు ఈ వార్తలతో ఆందోళన చెందుతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా వారికి కొంత ఊరటనిస్తోంది.
ప్రస్తుతం గగనతలం మూసివేయడం.. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జరిపే దౌత్యపరమైన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని రేవంత్ రెడ్డి వివరించారు. అక్కడ ఉన్న తెలుగు సంఘాలతో కూడా సమన్వయం చేసుకుంటూ.. అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Read Also: Iran Attack Oil Tanker Oman Coast: చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు