Amaravati: ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను రక్షించే ప్రభుత్వమా? భక్షించే ప్రభుత్వమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ ఇంధన సంక్షోభం రెట్టింపు, పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వినియోగదారులు
ఏపీలో నెలకున్న ఇంధన సంక్షోభంపై ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. రూ.500 డీజిల్ కోసం ఓ ఆక్వా రైతు పడిన ఆవేదనను అందులో ప్రస్తావించారు. కూటమి పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వారి పాలిట శాపంగా మారిందని విమర్శించారు.
ఆయిల్ పై ఓ రైతు ఆక్రోశిస్తున్న ఓ వీడియో షేర్ చేశారు. కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపం అంటూ ప్రస్తావించారు. ఇంధన సంక్షోభం వల్ల రొయ్య రైతులకు అంతులేని కష్టం వచ్చిందన్నారు. కంటికి రెప్పలా చూసుకొనే రొయ్య పిల్లలను బతికించేందుకు పెట్రోల్ బంకు దగ్గర రైతన్న పడిన ఆవేదనను గుర్తు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఏపీలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రంలో ఫ్యూయల్ కోసం ప్రజల పడిగాపులా? పెట్రోల్ బంకుల దగ్గర మల్ల యుద్ధాలా? రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్ పోయడమా? ఇదెక్కడ న్యాయమని ప్రశ్నించారు. సరిపడేంత ఇంధనం ఉంటే దాదాపు 3 వేల బంకుల్లో No Stock బోర్డులు ఎందుకున్నాయని ప్రశ్నలు మీద ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్ర ప్రజలపై కేంద్రానికున్న చిత్తశుద్ధి ఇదేనా? అందుకేనా మోదీజీకి మద్దతు ఇచ్చేది? అన్ని రంగాలపై ఇంధన సంక్షోభం తీవ్ర పరిణామాలు చూపిస్తుంటే, ఇంకా బీజేపీ భజన చేయడానికి సీఎం చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. ఏపీపై బీజేపీకి పట్టింపు లేదనడానికి ఇంధన సంక్షోభం ఒక నిదర్శనమని తేల్చేశారు. వదంతులు నమ్మొద్దని చెప్పే బదులు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.
ALSO READ: ఏపీలో ఇంధన సంక్షోభం.. డీజిల్ కోసం కాళ్లు పట్టుకుని బతిమిలాడిన ఆక్వా రైతు