AP Council Row: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుపై.. అధికార కూటమి ఎమ్మెల్సీలు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు గుర్రుగా ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు.. తమ రాజీనామాలను ఆమోదించాలని మండలి ఛైర్మన్కు పదే పదే కోరుతున్నారు. అయినప్పటికీ ఛైర్మన్ రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. ఛైర్మన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారని సమాచారం.
వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, జకియా ఖానమ్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ తమ పదవులకు రాజీనామా చేశారు. అయినప్పటికీ ఆ రాజీనామాలను మండలి ఛైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు. ఛైర్మన్ ను నేరుగా కలిసి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలు కూడా అందించారు. అయినా ఛైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడంతో వివాదానికి కారణమైంది. ఛైర్మన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తమను సాంకేతికంగా పదవుల్లో కొనసాగించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని వారంతా అనుమానిస్తున్నారు.
ఏపీ శాసన మండలిలో వైసీపీకి సంఖ్య బలం ఉంది. అయితే ఇటీవల ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచాయి. దీంతో కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం పెరుగుతుందనే రాజకీయ వ్యూహాలు లేకపోలేదు. ఆ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన అస్త్రం వాడాలని పలువురు ఎమ్మెల్సీలు భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే మరోవైపు ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారని వైసీపీ మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేసింది. తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించారని వారిపై అనర్హ వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఛైర్మన్ మోషేన్ రాజు ఇప్పటికే విచారణ చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లతో ప్రత్యేకంగా సమావేశమై, ఎందుకు రాజీనామా చేశారు. ఎవరైనా ఒత్తిడి చేశారా? అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. తాము ఎవరి ఒత్తిడితోనో, వేరే ప్రలోభాలు లొంగి రాజీనామా చేయలేదని ఎమ్మెల్సీలు ఛైర్మన్ కు స్పష్టం చేశారు. అయినప్పటికీ తమ రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో అవిశ్వాసానికి రెడీ అవుతున్నారు.
Also Read: ఏపీ మండలిలో లడ్డూ రగడ.. మండలి చైర్మన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!