AP News: ఏపీలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అనంతపురం జిల్లా కోర్టు రికార్డ్ అసిస్టెంట్తో పాటు అడిషనల్ మెజిస్ట్రేట్కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
అటు ఏలూరులోని PJCJ కోర్టుకు కూడా బాంబు పెట్టామంటూ మెయిల్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి సోదాలు నిర్వహించారు. సైబర్ పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
చిత్తూరులో న్యాయమూర్తి సెల్ఫోన్కే బెదిరింపు సందేశం రావడంతో డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలో పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని అణువణువూ గాలించారు. వరుసగా కోర్టులనే లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
విశాఖపట్నం జిల్లా కోర్టులో కూడా బాంబు బెదిరింపు కలకలం రేగింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఒక ఈ-మెయిల్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘనపై విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తక్షణమే స్పందించారు. సీపీ ఆదేశాలతో భారీ ఎత్తున పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్ సాయంతో కోర్టులోని ప్రతి అంగుళాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోర్టు హాల్స్, పరిపాలనా కార్యాలయాలు, వాహనాల పార్కింగ్ షెడ్లను బాంబు స్క్వాడ్ సిబ్బంది జల్లెడ పడుతుంది.
ముందస్తు జాగ్రత్తగా పలు జిల్లా కోర్టుల ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు పంపిస్తున్నారు.. అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇది కేవలం ఆకతాయిల పనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం
అనంతపురం, చిత్తూరు, ఏలూరు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు
బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన ఆగంతకులు
రంగంలోకి బాంబు స్క్వాడ్, పోలీసులు
కోర్టు హాల్స్, కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు
మెయిల్స్ పంపిన ఆగంతకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసుల ఆరా pic.twitter.com/lMmOLZHChQ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2026