Pawan Kalyan: తల్వార్ తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చెప్పిన మహనీయుడు గురు తేగ్ బహదూర్ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తనది కాని ధర్మం కోసం తన శిరస్సుని త్యాగం చేసిన మహనీయుడని కీర్తించారు. అందుకే చరిత్ర గురు తేగ్ బహదూర్ సింగ్ జీని ధరమ్ ది చాదర్.. ఔర్ హింద్ ది ఛాదర్ గా కీర్తిస్తుందన్నారు. ఆయన బలిదానాన్ని యావత్ భారతదేశం సత్యం, సాహసం, భావోద్వేగంతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. తేగ్ బహదూర్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు ధర్మాన్ని ఒక హక్కుగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో ప్రముఖ సిక్కు గురువు తేగ్ బహదూర్ సింగ్ జీ 350వ షాహిదీ సమాగమంలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “350 ఏళ్లు గడచినప్పటికీ మనమంతా గురు తేగ్ బహదూర్ సింగ్ జీ బలిదానాన్ని స్మరిస్తున్నామంటే ఆయన త్యాగం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. ప్రతి మనిషిలోని వివేకానికి పరీక్ష పెట్టిన ఘటన. 1675 నవంబర్ 24న ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద పెద్ద సమూహం నిలబడి ఉన్నా అందరిలోనూ తెలియని భయం వ్యాపించి ఉంది. ఓ వైపు సమూహం మరోవైపు ప్రభుత్వం, ఇంకో వైపు ఓ శాంతి దూత ఉన్నారు. తన త్యాగంతో ధర్మ పరిరక్షణ సాధ్యమన్న విషయం ఆ దూతకి తెలుసు. బలిదానం అయిన ఆయన్ను తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. ఆయన బలిదానం నేడు పొరుగు దేశాల్లో ఉన్న హిందూ మైనారిటీల వేదనను గుర్తు చేస్తుంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
“గురు తేగ్ బహదూర్ జీ త్యాగం ఒక చరిత్ర మాత్రమే కాదు. మనందరికీ ఒక హెచ్చరిక. ఈ వేదిక నుంచి భారతీయ యువతకు ఒక మాట చెప్పదలచుకున్నా… గురు తేగ్ బహదూర్ జీ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఒకటే. మన దేశానికి నేడు బలంగా మాట్లాడే స్వరం అవసరం లేదు.. ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడిన స్వరం అవసరం.
ఆధ్యాత్మిక శక్తి సామాజిక జీవనానికి దారి చూపాలి. మహారాష్ట్ర ఎప్పుడూ ఇదే చెప్పింది. నిజమైన బలం ఆధిపత్యంలో కాదు పరోపకారంలో ఉంటుందని చాటి చెప్పింది. మహారాష్ట్ర ఒక అసాధారణమైన భూమి. ఇది కత్తి, యుక్తి, కరుణ, శక్తి, సంవేదం కలసి జీవించిన నేల. ఛత్రపతి శివాజీ నుంచి సంత్ తుకారాం జీ, సంత్ జ్ఞానేశ్వర్ జీ, మహాత్మా జ్యోతీబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ లాంటి మహనీయులను దేశానికి అందించిన నేల మహారాష్ట్ర” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read: ఒక్క నిర్ణయంతో కోట్ల ప్రాజెక్ట్ వదులుకున్న పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!
దేశానికి మానవ విలువలను కాపాడే వీరత్వం, ఆత్మపరిశీలన చేసుకునే వివేకం కలిగిన నాయకత్వం అవసరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2047 వికసిత్ భారత్ విజన్ కేవలం ఆర్థిక అభివృద్ధి మంత్రం కాదని, సంస్కృతి, సంప్రదాయం, సామాజిక నిబద్దత కూడా అన్నారు. యువత భాగస్వామ్యం లేకపోతే అది సాధ్యపడదన్నారు. నాందేడ్ పవిత్ర భూమి నుంచి మనమంతా ఒక సంకల్పం తీసుకుని బయలుదేరుదామన్నారు. భారతదేశం తాలూకు సార్వభౌమాధికార పరిరక్షణ కోసం మనమంతా వటవృక్షంలా నిలబడదామన్నారు.