Amaravati: వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న నేతలకు కొత్త కేసులు వెంటాడుతున్నాయి. ఈ జాబితాలోకి మాజీ మంత్రి కొడాలి నాని చేరిపోయారు. కొడాలి నాని విచారణపై ప్రాసిక్యూషన్కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైసీపీలో కొత్త గుబులు మొదలైంది.
వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు
వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. తాజాగా కొడాలి నానిని విచారణకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై కొడాలి నాని దూషణలకు దిగారు. ఆ సమయంలో కొడాలి నాని ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
స్థానిక కోర్టు అనుమతితో 2021 ఫిబ్రవరి 16న గుడివాడ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదు అయ్యింది. ఆయన మంత్రిగా పని చేయడంతో కేసు విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికతో ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
కొడాలి నాని వంతు, విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ చేయవచ్చని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉంది. ఇప్పుడు కొడాలి నానిని పోలీసులు విచారించనున్నారు. విచారణలో మాజీ మంత్రి నిజాల చెబుతారా? బయట మీడియాతో మాట్లాడినట్టుగానే అధికారులకు సమాధానాలు ఇస్తారా?
విచారణకు కొడాలి నాని సహకరించకుంటే అరెస్టు చేసే అవకాశాలున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు. కొడాలి నాని విషయం తెలియగానే వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. పార్టీ తరపున వాయిస్ బలంగా వినిపించే నానికి ఇలాంటి ఈ పరిస్థితి ఉంటే.. మన పరిస్థితి ఏంటన్న గుసగుసలు అప్పుడే మొదలయ్యాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ల తర్వాత నాని చుట్టూ ఉచ్చు బిగుసుకుంది.
ALSO READ: కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి? డైవర్ట్ కోసమేనా?