Pawan Kalyan: తీర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వేధిస్తున్న తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టుల వేగాన్ని మరింత పెంచాలన్నాను. ప్రజల దాహార్తిని తీర్చడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉభయ గోదావరి జిల్లాలకు బిగ్ రిలీఫ్
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో ‘అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్’ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా సుమారు 33 లక్షల మందికి శుద్ధమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం రూ.270 కోట్ల విలువైన పనులు క్షేత్రస్థాయిలో పురోగతిలో ఉన్నాయి. రెండు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే దాదాపు 400 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
శాఖల సమన్వయం.. పనుల్లో వేగం
ప్రస్తుతం నత్తనడకన సాగుతున్న పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పైప్లైన్ల ఏర్పాటుకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ శాఖల అనుమతులను వేగంగా క్లియర్ చేసుకోవాలన్నారు. దీని కోసం రోడ్లు-భవనాలు, జాతీయ రహదారుల సంస్థ , పంచాయతీరాజ్, అటవీ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రాల్లోని ‘ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల’ ద్వారా నిరంతర రివ్యూలు నిర్వహించాలన్నారు.
నాణ్యతలో నో కాంప్రమైజ్
తాగునీటి ఎద్దడి ఎక్కువ ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగాన్ని పెంచడంతో పాటు, నిర్మాణాలు అత్యంత నాణ్యతతో ఉండాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న జల్ జీవన్ మిషన్ పనులను స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని, పనుల నాణ్యతను దగ్గరుండి తనిఖీ చేస్తానని హెచ్చరించారు.
Also Read: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు!