AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం (02-12-2025) ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు నెల్లూరు జిల్లా కొడవలూరులో 38.7మిమీ, నెల్లూరులో 36.7మిమీ, తిరుపతి జిల్లా తడలో33.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత ఎక్కువైంది. గత రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా కదులుతోందని వెల్లడించింది. దిత్వా తుపాను చెన్నైకి 50 కి.మీ, పుదుచ్చేరికి 130 కి.మీ, నెల్లూరుకి 200 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాబోయే మూడ్రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Also Read: Rajole: రాజోలు.. గ్లాస్ పార్టీలో గందరగోళం
దిత్వా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే తుపాను బలహీనపడడంతో రేపు విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.