Andhra Pradesh Heatwave Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 49 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రాయలసీమ, కోస్తా ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు. విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంగళవారం(ఏప్రిల్ 14) నాడు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ రోజు 53 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 57 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. విజయనగరంలో 18 మండలాలు, పార్వతీపురం మన్యంలో 15, శ్రీకాకుళంలో 9, అనకాపల్లి, పోలవరంలో చెరో 3, ఏలూరులో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలం ప్రభావితం కానున్నాయి. అలాగే కాకినాడ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో కూడా వేడి గాలుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం నాడు కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాలలో 42.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా తేరన్నపల్లిలో 42.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఏప్రిల్ మధ్యలోనే ఎండలు మండిపోతున్నాయని అర్థమవుతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కపోతతో జనం మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ నేరుగా సూర్యరశ్మి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరింది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. వడదెబ్బ తగలకుండా గొడుగులు, టోపీలు ధరించాలని, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు హెచ్చరించారు.
Read Also: మ్యాజిక్ ఫిగర్ కోసం దక్షిణాదిని బలి చేస్తారా? కేంద్రంపై రేవంత్ ఫైర్