Heavy Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే చల్లని కబురు అందించింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన జనం ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురుచూస్తున్న వేళ.. ఇరు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో జూలై 8 వరకు వారం రోజుల పాటు విస్తారంగా వానలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన తుపాను గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణపై వరుణుడి పంజా.. ఏడు రోజుల పాటు అలర్ట్!
తెలంగాణ వ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి. జూలై 8 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా జూలై 5వ తేదీన వాతావరణం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, ఆ రోజున ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు దాదాపు అన్ని జిల్లాలను ఉపరితల గాలులు వణికించే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలి రెండు రోజులు ఆ జిల్లాల్లోనే అసలు సిసలైన ‘భారీ’ ముప్పు
వాతావరణ మార్పుల ప్రభావం మొదటి రెండు రోజుల్లోనే చాలా తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపించనున్నాడు. నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రికార్డు స్థాయి అత్యధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. జూలై 3న కూడా ఇదే తీవ్రత కొనసాగుతూ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం ఎక్కువగా ఉండనుంది.
భాగ్యనగరానికి వాన గండం.. మేఘావృతమైన ఆకాశం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల ప్రజలు కూడా గొడుగులు సిద్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో కమ్మేసి, ఎప్పుడైనా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. జూలై 4 నాటికి ఈ వర్షాల తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఏపీకి అల్పపీడన ముప్పు.. కోస్తా తీరంలో హై అలర్ట్!
మరోవైపు ఆంధ్రప్రదేశ్ను కూడా వానలు ముంచెత్తనున్నాయి. రేపు బంగాళాఖాతంలో ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఒక బలమైన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా రాజస్థాన్ వైపు పయనించినప్పటికీ, దీని ప్రభావంతో జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా భారీ వర్షాలు, జూలై 5 నుంచి రాయలసీమ సహా ఏపీలోని మెజారిటీ ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి. ఇప్పటికే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
Also Read: తెలంగాణలో నేడు కాలేజీల బంద్.. ప్రైవేట్ యాజమాన్యాల సంచలన నిర్ణయం.. కారణం ఇదే!