Early Independence Day: భారతదేశం తన స్వాతంత్ర దినోత్సాన్ని ఏటా ఆగస్టు 15న జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు కూడా ఇదే రోజున వేడుకలు జరుపుకొని మువ్వెన్నెల జెండాను ఎగురవేస్తాయి. అయితే మధ్యప్రదేశ్లోని రెండు ప్రముఖ దేవాలయాలు మాత్రం 4 రోజుల ముందే అంటే ఆగస్టు 11నే జాతీయ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించి.. యావత్ దేశాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేశాయి. ఆంగ్ల క్యాలెండర్ ను కాకుండా.. హిందూ పంచాగానికి అనుగుణంగా చూస్తే భారత్ కు ఆగస్టు 11నే స్వాతంత్రం వచ్చిందని అర్చకులు చెబుతున్నారు. దీనికి గల కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చరిత్ర చెబుతోంది. అయితే శుభసమయంలో హిందూ క్యాలెండర్ ప్రకారం ‘శ్రావణ కృష్ణ చతుర్దశి’ తిథి ఉంది. దీంతో ఉజ్జయిని, మండ్సౌర్లలోని గణపతి, పశుపతి ఆలయాల అర్చకులు.. ఆంగ్ల తేదీ కంటే పవిత్రమైన తిథికే ప్రాధాన్యమిచ్చారు. వారి ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 11న శ్రావణ కృష్ణ చతుర్దశి వచ్చింది. దీంతో దానికి అనుగుణంగా ఆ రెండు ఆలయాల్లో ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మండ్సౌర్లోని శివ్నా నది ఒడ్డున ఉన్న పురాతన పశుపతినాథ ఆలయంలో ఆగస్టు 11న ఈ వేడుకలు ఎంతో నిష్ఠతో సాగాయి. అరుదైన అష్టముఖ శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు అభిషేకం చేశారు. దేశంలో అరిష్టాలు తొలగి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ పూజలు నిర్వహించినట్లు అలయ అధికారి ఉమేష్ జోషి తెలిపారు. 1985 నుంచి ఈ ఆలయంలో ప్రతీ ఏటా తిథి ప్రకారమే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఇదేందయ్యా ఇది.. కూరగాయల షాప్లో ఈ రేంజ్ మార్కెటింగా? వీడియో చూస్తే మైండ్ బ్లాకే!
మరోవైపు ఉజ్జయినిలోని ప్రసిద్ధ ‘బడే గణేష్’ ఆలయంలోనూ 4 రోజుల ముందే స్వాతంత్ర వేడుకలు జరిగాయి. డప్పుల శబ్దాలు, దేశభక్తి నినాదాల మధ్య ఆలయ ప్రాంగణంలో ఉత్సాహంగా ‘తిరంగా యాత్ర’ నిర్వహించారు. ముందుగా మువ్వన్నెల జాతీయ జెండాను గణపతి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక మహా హారతి ఇచ్చారు. అనంతరం ఆలయ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. మెుత్తంగా యావత్ దేశం ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటే.. ఈ రెండు ఆలయాల్లో మాత్రం.. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా ఆగస్టు 11న వేడుకలు జరగడం విశేషం. ప్రస్తుతం ఈ అంశమే ఆ రెండు ఆలయాలను ప్రత్యేకంగా నిలిపాయి.
Also Read: ‘నా దగ్గర బాంబు ఉంది’.. ప్రయాణికుడి వ్యాఖ్యతో.. విమానాశ్రయంలో రచ్చ రచ్చ!