Seediri Appalaraju: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తన కుమారుడు ఆరవ్ను ఒక రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు బుధవారం ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం పలాస కోర్టులో హాజరుపరచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అప్పలరాజుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను అంపోలు సెంట్రల్ జైలుకు తరలించారు.
కోర్టు వద్ద ఉద్రిక్తత, నిరసనలు
రిమాండ్ వార్త తెలియడంతో పలాస కోర్టు ప్రాంగణంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే క్రమంలో శ్రీకాకుళంలో మహిళలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కాసేపు స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు
ఈ పరిణామాలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించారు. మొన్న జోగి రమేష్, నిన్న కారుమూరి, నేడు అప్పలరాజును అక్రమంగా జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పాలనలో ‘రెడ్బుక్ రాజ్యాంగం’ పరాకాష్టకు చేరిందని వైసీపీ అధికార ప్రతినిధి వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Also Read: కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!