Colleges Bandh: తెలంగాణ విద్యాశాఖలో గత కొంతకాలంగా నలుగుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం ఇప్పుడు రోడ్డెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో బీసీ జేఏసీ (BC JAC) నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మద్దతు ప్రకటించిన యాజమాన్యాలు
బీసీ జేఏసీ ఇచ్చిన ఈ బంద్ పిలుపునకు ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ‘తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్’ తో పాటు ‘తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్’ కూడా ఈ బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. కాలేజీల యాజమాన్యాలు కూడా బంద్కు మద్దతు తెలపడంతో నేడు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల నిర్వహణ పూర్తిగా నిలిచిపోనుంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ బంద్ పరిధిలోకి రానున్నారు.
ఆర్థిక సంక్షోభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు
ప్రభుత్వం నుంచి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. భవనాల అద్దెలు చెల్లించలేక, అధ్యాపకులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక విద్యాసంస్థల నిర్వహణ భారం కాబోతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఈ విరామ నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు పేర్కొంటున్నారు.
తక్షణమే విడుదల చేయాలి..
ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యాసంస్థల మనుగడను కూడా దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు, యాజమాన్యాలకు ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ప్రభుత్వ తీరుపై పోరాడుతామని హెచ్చరించారు. ఈ బంద్ నేపథ్యంలో విద్యాశాఖ లేదా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: మహిమా? సైన్సా? వారాహి అమ్మవారి విగ్రహానికి చెమటలు.. కాకినాడలో అరుదైన వింత!