![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/ap-weather-1-copy.jpg)
AP Weather : నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. అలాగే చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అల్పపీడనం పరిసరాల్లో 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.
రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం ఈనెల 12లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశాఖపట్నంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.