AP News: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివేట్ అవుతున్నారా? అర్జున్రెడ్డి ఏడాదిన్నరగా ఏపీ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారా? కూటమి సర్కార్ ఏమీ చేయదని భావించి అడుగుపెట్టారా? ఇద్దరు అరెస్టుతో మిగతా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కష్టాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర తర్వాత మెల్లగా యాక్టివేటు అవుతోంది వైసీపీ. ఆ పార్టీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేయడం మొదలుపెడుతున్నాయి. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివేట్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, కామెంట్స్ చేసిన ఇద్దరు కార్యకర్తలు అరెస్టు అయ్యారు. దీంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైంది.
వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అర్జున్రెడ్డిని సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా లో సజ్జల భార్గవ్రెడ్డితో కలిసి అర్జున్రెడ్డి క్రియాశీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్తోపాటు వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అర్జున్రెడ్డి మార్ఫింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు అరెస్ట్
వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో గతేడాది నవంబరులో అతడిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అర్జున్రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో అతడు విదేశాలకు పారిపోయాడు. ఆ తర్వాత ఏపీ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం విదేశాల నుంచి అర్జున్రెడ్డి హైదరాబాద్కు వచ్చాడు.
ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ నుంచి వెళ్లిన పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన అర్జున్రెడ్డి, అప్పటికే తన న్యాయవాదులను ఎయిర్పోర్టుకు రప్పించాడు.
అర్జున్రెడ్డిపై కడప సహా పలు జిల్లాల్లో రకరకాల కేసులున్నాయి. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో అతడిపై అనుమానాలున్నాయి. ఇంతకీ అర్జున్ రెడ్డి ఎవరు? జగన్కు బాబాయి వరుసయ్యే వైఎస్ ప్రకాశ్రెడ్డి మనవడే. వివేకా కేసులో నిందితుడు సునీల్యాదవ్ సోదరుడు కిరణ్యాదవ్-అర్జున్రెడ్డిల మధ్య హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ లో మాటలు జరిగినట్టు అభియోగాలున్నాయి.
ALSO READ: ఇంట్లోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిని రేప్ చేసిన యువకుడు
రీసెంట్గా ఈ కేసు దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులోనూ అతడు ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా కడప జిల్లా బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని హైదారబాద్లో ఏపీ అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్, లోకేశ్తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గతేడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు కడప టీడీపీ నేతలు. ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
కూటమి అధికారంలోకి రాగానే శ్రీనివాసులరెడ్డి విదేశాలకు పారిపోయాడు. అతడిపైనా ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం గల్ఫ్ నుంచి హైదారాబాద్కు రాగానే ఎయిర్పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కడపకు ఆయన్ని తీసుకెళ్లారు పోలీసులు. ఇలా వరుసగా వైసీపీ సోషల్ మీడియాలో కార్యకర్తలు అరెస్టు కావడంతో మిగతావారిలో టెన్షన్ మొదలైంది. ఇలాంటి పోస్టులకు దూరంగా ఉండడమే బెటరన్న వాదన అప్పుడే మొదలైంది.