Ayyanna case: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సీఐడీ దర్యాప్తునకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నకిలీ ఎన్ఓసీ సమర్పించి 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని కబ్జా చేశారని అయ్యన్నపాత్రుడిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన భూఆక్రమణ కేసును కొట్టివేయాలని సవాల్ చేస్తూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.
అయ్యన్నపై కావాలనే సెక్షన్ 467 నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అసలు ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని వాదనలు వినిపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే అయ్యన్న సంతకం ఫోర్జరీ చేశారని సీఐడీ తరఫున న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను భయపెట్టి బెదిరించారని అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించి అయ్యన్నపై నమోదైన కేసులో సెక్షన్ 467 వర్తించదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.