cm Kcr: మునుగోడు ఉప ఎన్నికల విజయం తర్వాత కూడా కామ్రేడ్లతో పొత్తును గులాబీ పార్టీ కంటిన్యూ చేయనుందా? మునుగోడు ఉప ఎన్నికల్లో ఎర్రజెండాల దోస్తానా కలిసి వచ్చిందని కేసీఆర్ భావిస్తున్నారా? బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తులోనూ ఈ జోడీ కలిసి సాగుతుందా? అనేది ఆసక్తికరం.
మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేసిన సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి పని చేసేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తమకు… వామపక్షాలతో దోస్తీ మరింత బలాన్ని ఇస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో అనేక సార్లు బహిరంగంగా వామపక్ష పార్టీలను, అనుబంధ సంఘాలను విమర్శించిన కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో వారి మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించారు.
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి సాగుతామని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఇందుకు కామ్రేడ్లు సైతం సుముఖత వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డితో పాటుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇతర టిఆర్ఎస్ నేతలు సీపీఎం,సీపీఐ కార్యాలయాలకు వెళ్లి నేతలతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు కలసి సాగుతామని టిఆర్ఎస్,వామపక్ష నేతలు ప్రకటించారు.
ఇప్పటికే వరుసగా 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ వరుసగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో వున్న వ్యతిరేకతను అధిగమించి మూడో సారి అధికారంలోకి రావాలన్నా… బీజేపీని బలంగా ఎదుర్కోవాలన్నా సీపీఎం, సీపీఐ పార్టీలను వచ్చే ఎన్నికల్లో కలుపుకు పోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని అనేక నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు బలమైన క్యాడర్ కలిగి ఉంది. దీనికి తోడు అనుబంధ సంఘాలు కూడా బలంగా ఉండటం తమకు కలిసి వస్తుందని టిఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెరో ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు చెరో పార్లమెంట్ స్థానాన్ని టిఆర్ఎస్ కేటాయిస్తుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫర్ ను కామ్రేడ్లు సైతం సంతోషంగా స్వీకరిస్తారన్న టాక్ నడుస్తోంది.