Anantapur: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెళుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కార్తీక్ రెడ్డి (Dr. Karthik Reddy) ఆదివారం సాయంత్రం పంపనూర్ కాలువలో గల్లంతై మరణించారు. అత్యంత విచారకరంగా, ఈ దుర్ఘటన మొత్తం ఆయన కుటుంబ సభ్యుల కళ్లెదుటే జరిగింది. ఈతకు వెళ్లిన ఆయన, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గాలింపు బృందాలు సోమవారం ఆయన మృతదేహాన్ని వెలికితీశాయి.
వివరాల్లోకి వెళితే, డాక్టర్ కార్తీక్ రెడ్డి ఆదివారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలోని కాలువ వద్దకు వెళ్లారు. తొలుత ఆయన చేతులు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి కాలువలో జారిపడ్డారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈత కొట్టేందుకే కాలువలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కాలువలో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ప్రమాదాన్ని శంకించిన కుటుంబ సభ్యులు, “వెనక్కి రా” అంటూ గట్టిగా అరిచినా డాక్టర్ కార్తీక్ రెడ్డి వారి మాటలను పట్టించుకోలేదు. ఆయన ఈత కొడుతూ కాలువపై ఉన్న బ్రిడ్జి కిందికి దూరినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఉధృత ప్రవాహానికి ఆయన అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయారు. కళ్లెదుటే తమ ఆప్తుడు కొట్టుకుపోతుండటంతో కుటుంబ సభ్యులు చేసిన ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని విషాదభరితం చేశాయి.
సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది.. గజ ఈతగాళ్లతో కలిసి వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి సమయం కావడంతో గాలింపుకు ఆటంకం కలిగినా, అహోరాత్రులు శ్రమించి సోమవారం నాడు కార్తీక్ రెడ్డి మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీశారు. ఒక యువ వైద్య అధికారి, కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఇలా అకాల మరణం చెందడం స్థానికంగా, వైద్య వర్గాల్లో తీవ్ర విచారాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.