Darsi MLA Maddisetty Venugopal: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే దర్శి.. ఎన్నికలు దగ్గర పడే కొద్ది పొలిటికల్ హిట్తో కాగిపోతోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రావు ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి ఉన్న ఒకే ఒక కాపు ఎమ్మెల్యే. రాష్ర్ట వ్యాప్తంగా సీట్ల మార్పులు చేర్పులు చేపట్టిన వైసీపీ మద్దిశెట్టిని సిట్టింగ్ స్థానం తప్పించి.. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రాసాద్రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టింది.
మద్దిశెట్టిని దర్శి నుంచి తప్పించి షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత.. ఆయనకు రాజకీయ విరోధిగా మారిన శివ ప్రసాద్ను ఇన్చార్జిగా నియమించారు. దాంతో మద్దిశెట్టి ఆయన అనచరులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో జాయిన అయిన మద్దిశెట్టి వేణుగోపాల్కు మాజీ ఎమ్మల్యే బూచేపల్లి శివప్రసాద్ మద్దతు ప్రకటించారు. 2009లో దర్శి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాద్ రెడ్డి. జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బై పోల్స్లో తిరిగి గెలుపొందారు.
గత ఎన్నికలలో వైసీపీ అధిష్టానం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే టికెట్ కేటాయించినా.. ఆయన సోదరుడి మరణం, తండ్రి అనారోగ్యాల కారణంగా పోటీకి దూరంగా ఉండిపోయారు. ఆ క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్కు మద్దతు ఇచ్చారు. అయితే మద్దిశెట్టిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగినట్లు వైసీసీ సర్వేల్లో తేలిందంట. అదికాక దర్శి నగర పంచాయతీ టీడీపీ వశం కావడం కూడా ఆయనకు మైనస్ అయింది. దాంతో వైసిపి తిరిగి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read More: YSRCP plan for AP MP Elections: రాజ్యసభ ఎన్నికలు.. వైసీపీకి ఇది చాలా టఫ్ గురూ.. బడా వ్యూహమేంటి..?
గత ఎన్నికల్లో కలిసి పనిచేసినప్పటికీ.. బూచేపల్లి, మద్దిశెట్టిల మధ్య తర్వాత గ్యాప్ పెరిగిపోతూ వచ్చింది. వైసీసీ అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని శివప్రసాద్ తల్లి బూచేపల్లి వెంకయమ్మకు కట్టబెట్టింది. అప్పటి నుంచి దర్శిలో రెండు పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. అధికారుల బదిలీలు, నిధుల కేటాయింపులు జడ్పీ ఛైర్పర్సన్ చేతిలో ఉండటంతో ఇటు ఎమ్మల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే శివప్రాసాద్ రెడ్డిల మధ్య అధిపత్యపోరు పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మద్దిశెట్టి రగిలిపోతున్నారు. వైసీపీ పెద్దలు ఒంగోలు పార్లమెంట్ స్థానం, పర్చూరు నియోజకవర్గం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు. దర్శి నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ అనేది కార్యకర్తలే డిసైడ్ చేస్తారని ఇటీవల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మద్దిశెట్టి పేర్కొన్నారు. ఏదేమైనా మద్దిశెట్టి దర్శి ఎన్నికల బరిలో దిగడం పక్కా అంటున్నారు. దర్శి నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాకింగ్ కీలకంగా ఉంటుంది . కాపుతోపాటు కమ్మ ఓటు బ్యాకింగ్ టీడీపీ అనుకులంగా ఉంటుంది. టీడీపీ జనసేన పార్టీల పొత్తు లెక్కలతో మద్దిశెట్టి అటు వైపు చూస్తున్నారంట.
ఇప్పటికే మద్దిశెట్టి ఇటివల జనసేనలో చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయ్యారు. దర్శి జనసేన టిక్కెట్ ఫైనల్ చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. ప్రజరాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచే మద్దిశెట్టికి పవన్తో సత్సంబంధాలు ఉన్నాయంటున్నారు. మద్దిశెట్టి మంత్రి బొత్సకు వ్యాపార భాగస్వామి. బొత్స ఒత్తిడితోనే ఆయన సీటు గల్లంతైనా వైసీపీలో కొనసాగుతున్నారంట. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడేనాటికి ఆయన జనసేన కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. రెండేళ్లుగా దర్శిలో టీడీపీకి ఇన్చార్జ్ లేకపోవడం మద్దిశెట్టికి ప్లస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
మద్దిశెట్టి జనసేన అభ్యర్ధిగా దర్శి బరిలో దిగితే అక్కడ రాజకీయం రంజుగా మారనుంది. అటు బూచేపల్లి, ఇట్లు మద్దిశెట్టి ఇద్దరూ అన్ని విధాలా సౌండ్ పార్టీలే . దాంతో ప్రశాంతమైన దర్శిలో ఈ సారి పొలిటికల్ హీట్ పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.