AI Scam: ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది ఆర్టిఫిషియలో తెలియడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి…ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగ తెలంగాణ టీడీపీ నేతలను గర్తుతెలియని వ్యక్తి మోసం చేశారు.
తెలంగాణ టీడీపీ నేతలకు టోకరా
గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది టీడీపీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమా పీఏనని పరిచయం చేసుకున్న అతను…సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికే ఉమాలా వీడియో కాల్ చేశాడు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని , దానికి మూడు ఫోన్ నంబర్లు ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ నెంబర్లుకు ఫోన్పేలో నగదు పంపాలని సూచించాడు. దీంతో టీడీపీ నేతలు అది నిజమేనని నమ్మి 35 వేలు పంపారు.
ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో మరోసారి వీడియో కాల్..
మరోసారి ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను బీఫామ్ ఇప్పిస్తానని నమ్మించాడు. మీతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియోకాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు సేకరించాలని చెప్పాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి.. అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తాననని నమ్మించాడు.
విజయవాడ వచ్చి ఓ హోటల్కి రావాలని సూచన
విజయవాడ వచ్చి ఓ హోటల్లో దిగమని సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారనీ, వారికి బస ఏర్పాటు చేయాలని వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. వారు కూడా నిజమేనని నమ్మారు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వెళ్లి ఆ హోటల్లో దిగారు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేశాడు. సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లడానికి కేవలం 8మందికే అనుమతి ఉందనీ, ఆయన వద్దకు వెళ్లాలంటే ఒక్కొక్కరు 10 వేలు ఇవ్వాలని చెప్పాడు. దానితో వారికి అనుమానం వచ్చింది.
Also Read: ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?
ఇష్యూ పోలీసుల వరకు వెళ్లడంతో బట్టబయలు..
ఇదే టైమ్లో హోటల్ సిబ్బంది ఫుడ్ బిల్లు కట్టాని పట్టుబట్టడంతో వారు గొడవకు దిగారు. ఈ ఇష్యూ పోలీసుల వరకు వెళ్లడంతో రంగంలోకి దిగారు. డెరెక్ట్ దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. తాను ఎవరికీ వీడియోకాల్ చేయలేదనీ, ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా అందరికీ కాల్స్ చేసి మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఇక అసలు విషయం తెలియడంతో ఖమ్మం జిల్లా నేతలు షాక్ అయ్యారు. ఏఐ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.