AP Politics: జగన్ నర్సీపట్నం టూర్ కొత్త అంశాలను తెరపైకి తెచ్చిందా? ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతి లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? గతంలో మూడు రాజధానులు ఎలా చేశారో, అదే సెంటిమెంట్ని వైసీపీ కంటిన్యూ చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జగన్ నర్సీపట్నం టూర్లో కొత్త అంశాలు
మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ అధినేత జగన్ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతికి లింకు పెట్టేశారు. విశాఖలో కేజీహెచ్, రిమ్స్ తప్పితే మెడికల్ కాలేజీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య కంపేర్ చేసి విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ గతంలో మూడు రాజధానుల పేరిట ఎలాంటి గేమ్ ఆడిందో, మళ్లీ అలాంటి సెంటిమెంట్ను రెచ్చగొట్టారు.
ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ వెంటనే రియాక్ట్ అయ్యింది. జగన్ టూర్ తర్వాత టీడీపీ ప్రధాన కార్యదర్శి విజయ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవుగానీ, అమరావతి కట్టడానికి నిధులున్నాయా? అంటూ పలు ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్.
మళ్లీ ప్రాంతాల మధ్య విధ్వేషాలు
దీన్ని చూపించి ప్రజలకు తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. వైసీపీ హయాంలో తాము 17 మెడికల్ కాలేజీ కట్టామంటూ అడ్మిషన్లు జరిగాయంటూ తొలుత ప్రచారం చేసుకుంది ఆ పార్టీ. మెడికల్ కాలేజీ అంశంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది.
వైసీపీ నిజంగా కాలేజీలు కట్టిందా? అనేదానిపై సెల్ఫీలు తీసి టీడీపీ నేతలు మెడికల్ కాలేజీల గుట్టు బయటపెట్టారు. చివరకు మొండి గోడలు, పిల్లర్లను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ లెక్కన జగన్ మాటల్లో కచ్చితంగా కొన్ని అంశాలు బయటపెట్టారని రాజకీయ విశ్లేషకుల మాట. మెడికల్ కాలేజీల నిర్మాణాల పేరుతో అమరావతి నిర్మాణానికి అడ్డుకునేందుకు జగన్ కంకణం కట్టారని అంటున్నారు.
ALSO READ: ఏపీ ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
ఈ క్రమంలో జగన్ ఏ అంశం తెరపైకి తెచ్చినా అమరావతికి లింకు పెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ మరోక వెర్షన్ తెచ్చారు. 2021లో అనకాపల్లిలో మెడికల్ కాలేజీ వస్తుందని ప్రకటించారు అప్పటి సీఎం జగన్. మరుసటి ఏడాది అంటే 2022లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలో నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తామంటూ మాట మార్చారు.
ఉన్నట్లుండి మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ హడావుడి చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు మంత్రి సత్యకుమార్. మెడికల్ కాలేజీ పేరుతో జగన్ హయాంలో భారీ అవినీతి జరిగిందన్నారు. నిర్మాణ సంస్థల నుంచి ఒక్కో కాలేజీకి రూ. 100 కోట్లు చొప్పున కమిషన్ తీసుకున్నారని తేల్చేశారు.
పీపీపీ మోడల్లో కాలేజీల నిర్మాణం మరో సంస్థ చేతికి వెళ్తే.. ముడుపుల బాగోతం బయటపడుతుందని భావించి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది వైద్యశాఖ మంత్రి మాట. అందుకే పీపీపీ మోడల్ వద్దని వైసీపీ డిమాండ్ చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఎలా చూసినా వైసీపీ ఎత్తుకున్న మెడికల్ కాలేజీ వ్యవహారం వారినే దెబ్బకొట్టినట్టు చెబుతున్నారు విశ్లేషకులు.