Botsa Satyanarayana: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి , ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న ఆయన సభలో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనై తూలిపడబోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే అప్రమత్తమై బొత్సను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అసెంబ్లీ వర్గాలు హుటాహుటిన వైద్యులను రప్పించాయి. బొత్స ఛాంబర్లో ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బీపీ సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో బీపీలో హెచ్చుతగ్గులు రావడం వల్లే ఆయనకు కళ్లు తిరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
బొత్స సత్యనారాయణ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి చికిత్స పొంది.. కోలుకున్న తర్వాతే మండలి సమావేశాలకు హాజరయ్యారు. తాజా ఘటన నేపథ్యంలో సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. బీపీ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు బొత్స సత్యనారాయణ సభ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలాంటి హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉందని.. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని వైద్యులు తెలిపారు.
Also Read:రేపే ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ప్లాంట్ శంకుస్థాపన.. సీఎంతోపాటు కేంద్రమంత్రులు రాక