Brahmamgari Matham: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ , ప్రభుత్వం నియమించింది. ఎన్నో వివాదాల అనంతరం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించడంతో మఠంలో భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా పీఠాధిపతి పదవి కోసం వివాదం నెలకొంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా ఈ వివాదం సాగింది. చివరికి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం పీఠాధిపతిగా ధార్మిక పరిషత్ నిర్ణయించింది.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంపై నాలుగేళ్లుగా వివాదం కొనసాగింది. 2021 మే 8న బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి అనారోగ్యంతో శివైక్యం చెందారు. అనంతరం నొస్సం వెంకటాద్రిస్వామి పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి, వీరి తర్వాత నొస్సం గోవిందస్వామికి అవకాశం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారుల మధ్య పీఠాధిపత్యానికి కోసం పోటీ మొదలైంది.
అప్పట్లో ఈ వ్యవహారంపై దేవాదాయశాఖ మంత్రి కూడా జోక్యంచేసుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. అయినా వ్యవహారం తేలలేదు. అయితే అప్పటి ఎమ్మెల్యే వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి మొదటి, రెండో భార్య కుమారులతో చర్చించారు. సమస్య పరిష్కారం అయిందనుకున్న సమయంలో పూర్వ పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసింది. తాజాగా ఈ వివాదం కొలిక్కి వచ్చింది. బ్రహ్మం గారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ధార్మిక పరిషత్ నిర్ణయించింది.
Also Read: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్