Kotamreddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. పట్టుకోసం కోటంరెడ్డి, ఆదాల మధ్య వార్ మొదలుకాబోతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధిష్టానంపై తిరుగబాటు ఎగురవేసిన నేత. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఆయనదే. నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మాస్ ఇమేజ్ ను సొంత చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ పదవి రాలేదు. అప్పటి నుంచి తన అసంతృప్తిని బయటపెట్టారు. స్వయంగా సీఎం జగన్ పిలిచి మాట్లాడిన కోటంరెడ్డిలో ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత పార్టీపై విమర్శలు చేసేందుకు వెనుకంజ వేయలేదు. దీంతో వైసీపీ అధిష్టానం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పింది. ఆ బాధ్యతలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. మరి ఆదాల నెల్లూరు రూరల్ పై పట్టుసాధిస్తారా? కోటంరెడ్డి చెక్ పెట్టగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆదాల యాక్షన్ మొదలుపెట్టారు.
నెల్లూరు కార్పొరేటర్ల మద్దతు కూడగట్టేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కార్పొరేటర్లతోపాటు ఎక్స్అఫిషియో మెంబర్లు పార్టీ ఇన్ఛార్జి కార్యాలయానికి చేరుకుని తమ మద్దతు ప్రకటించారు. మరో ఆరుగురు కార్పొరేటర్లు ఆదాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. కార్పొరేటర్లకు ఇకపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవొచ్చని ఆదాల వారికి భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరించారు. అభివృద్ధి కోసం సీఎంతో చర్చించి నిధులు తీసుకొస్తానని ఆదాల.. కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు.
వైసీపీకి చెందిన మరో కీలక నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆదాలకు మద్దతు పలికారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే శ్రీధర్ రెడ్డి గెలిచారని స్పష్టం చేశారు. గెలిచాక కష్టపడిన వారిని పక్కన పెట్టి పక్కపార్టీ వాళ్ళకి పదవులు ఇచ్చారని ఆరోపించారు. సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు అందరూ ఆదాలకు సంఘీభావం తెలుపుతున్నారని… కోటంరెడ్డి దగ్గర ఉన్న కార్పొరేటర్లు కూడా ఆదాల వైపు వచ్చేస్తారని విజయ్కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇలా ఆదాల నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే నెల్లూరు మేయర్ స్రవంతి కోటంరెడ్డికి మద్దతు పలికారు. అవసరమైతే తన పదవినే త్యాగం చేస్తానని తేల్చి చెప్పారు. తాను కోటంరెడ్డి వెంటే నడుస్తానన్నారు. మరో కార్పొరేటర్ కూడా కోటంరెడ్డికి మద్దుతుగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం కోటంరెడ్డికి ఉందనే వాస్తవం. మరి వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగినా గెలుస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. మరి కోటంరెడ్డికి ఆదాల చెక్ పెట్టగలరా?