America: అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో మహంకాళి అఖిల్సాయి అనే విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సాయి ఉన్నత చదువుల కోసం పోయిన ఏడాది అమెరికాకు వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతూ.. ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు.
సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని తన స్నేహితులతో కలిసి రూమ్కు వెళ్తూ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆగి కాసేపు ముచ్చటించారు. ఈక్రమంలో గార్డ్ వద్ద ఉన్న తుపాకీని పరిశీలిస్తుండగా.. అది మిస్ఫైర్ అయి అఖిల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించి ఓ తెలుగు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అనుమానితుడు రవితేజ గోలీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రవితేజ మేంట్గోమేరీ కౌంటీ డిటెన్షన్ ఫెసిలిటీ కస్టడీలో ఉన్నాడు.
ఇక అఖిల్ సాయి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం పరాయి దేశం వెళ్లి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.