Arava Sridhar MLA: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు 22/2026 నంబర్తో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేపై బీఎంఎస్ (BMS) సెక్షన్లు 318(2), 318(4), 351(2) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా, తనను మానసికంగా, శారీరకంగా హింసించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసు కేసు నమోదు కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. మరోవైపు, ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణను వేగవంతం చేసింది. సోమవారం ప్రారంభమైన విచారణలో భాగంగా, మంగళవారం కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కమిటీ ముందు హాజరయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. బాధితురాలు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఆధారాలు, చాటింగ్ వివరాలపై కమిటీ సభ్యులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణ అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, తాను కమిటీ ముందు హాజరై తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించానని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను, వాస్తవాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కుట్రపూరితమైనవని, విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ నిబంధనల ప్రకారం ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పోలీసు దర్యాప్తు, పార్టీ కమిటీ నివేదిక ఆధారంగా ఆయన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.
Read Also: Viral Video: భర్తను చావగొట్టిన భార్య.. గుండెలపై కూర్చొని పిడిగుద్దులు.. అదేం కొట్టుడురా నాయనా!